
. ద్విచక్ర వాహనాల కారణంగానేన 70శాతం రోడ్డు ప్రమాదాలు
. వాహనదారులు హెల్మెట్లు తప్పకుండా ధరించాలి
. జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: ద్విచక్ర వాహనాల కారణంగా 60 నుంచి 70 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగవార్ అన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపడంతోపాటు హెల్మెట్లు పెట్టుకోకపోవడం కారణమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రత్యక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కోర్టు న్యాయమూర్తి సునీత కుంచాల, రాజీవ్ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సామాన్యులతోపాటు ప్రభుత్వ శాఖల అధికారులు ట్రాఫిక్ నియమాలు పాటించడంతోపాటు హెల్మెట్లు ధరించాలన్నారు. రాంగ్ రూట్ ప్రయాణం కారణంగా జరుగుతున్న ప్రమాదాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండకుండా వాహనాలు నడిపితే శిక్షార్హులని, ఆ శిక్ష వాహనాలు నడిపిన పిల్లలకు కాదని, వారి తల్లిదండ్రులకు వర్తిస్తుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండని వారు వాహనాలు నడిపితే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందన్నారు. తల్లిదండ్రులు చిన్నచిన్న పనుల కోసం తమ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. 18 సంవత్సరాలు నిండని వారు తమ సరదా కోసం వాహనాలు నడుపుతూ తల్లిదండ్రులకు తీరని లోటు మిగల్చొద్దని విద్యార్థులకు సూచించారు. అనంతరంపోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి నెహ్రూ పార్క్ చౌరస్తా వరకు చేపట్టిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్ సీఐ వెంకటనారాయణ, వన్ టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
