పేకాట ఆడెది ఎట్లా?

5,469
  • నిర్మల్, మహారాష్ట్రలో క్లబ్ ల మూసివేత
  • అడ్డాల కోసం వెతుకులాటలో నిర్వాహకులు
  •  హైదరాబాద్ లో క్లబ్ లు ప్రారంభమౌతాయని అభయం
  • లీకేజిలపై పోలీసు శాఖలో ఆందోళన

బతుకమ్మ, నిజామాబాద్ – నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పేకాటరాయుళ్ళపై ఇటీవల కాలంలో పోలీసు,టాస్క్ ఫోర్స్ దాడులు పెరిగాయి. ఎక్కడైనా పేకాట ఆడుదామంటే వారం పది రోజులకే పట్టుబడడం రివాజుగా మారింది. ఎక్కడో ఒక చోట పేకాట స్థావరాలపై దాడులు అన్నవి నిత్యం జరిగే తంతుగా మారాయి.ఈ నెల రెండవ వారంలో నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి మండల కేంద్రంలో ఫంక్షన్ హాల్ ను పేకాట క్లబ్ గా మార్చిన వ్యవహరాన్ని ఇటీవల ఎస్సైల బదిలీల్లో భాగంగా అక్కడికి బదిలీల్లో వచ్చిన కొత్త ఎస్సై బట్టబయలు చేశారు. పేకాట క్లబ్ లను తలదన్నే విధంగా సకల సౌకర్యాలను, టేబుళ్ళను ఏర్పాటు చేసి కమ్మర్ పల్లి మండలం చౌట్ పల్లికి చెందిన నిర్వాహకుడు పేకాటను ఏడాదిన్నర కాలంగా నిర్వహిస్తున్న విషయం బహర్గతమైంది. స్థానికంగా ఒక ప్రజాప్రతినిధి అండతో క్లబ్ మాదిరిగా గత ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన కొత్త గవర్నమెంట్ లో అది కొనసాగింది. జిల్లా నలుమూలల నుంచి కాకుండా జగిత్యాల్, కోరుట్ల, రాజన్నసిరిసిల్లా జిల్లాల నుంచి కూడా అక్కడ జూదగాళ్ళు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. తాజాగా అక్కడ పేకాట స్థావరంపై పోలీసుల దాడితో ఈ వ్యవహరం బట్టబయలు అయింది. కానీ గతంలో ఉన్న పోలీసు అధికారులకు మామూళ్ళను ఇచ్చి పేకాట క్లబ్ ను నిర్వహించినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో గత ప్రభుత్వ హయంలో విచ్చలవిడిగా జరిగిన పేకాట స్థావరాలపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ దాడులు పెరిగాయి. గతంలో ఉన్న ప్రజాప్రతినిధుల అండతో పేకాట రాయుళ్ళు బహిరంగంగానే రెచ్చిపోయారని చెప్పాలి. మాక్లూర్ మండలానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి భర్త హైదరాబాద్ రోడ్డులో పేకాట స్థావరాన్ని నిర్వహించిన విషయం బట్టబయలైంది. గతంలో టాస్క్ ఫోర్స్ లో పని చేసిన సిఐలు, ఒక కానిస్టేబుల్ అండతో పేకాట మాక్లూర్, నిజామాబాద్ శివారు ప్రాంతాల్లో జోరుగా నిర్వహించినట్లు వెల్లడయింది. నిజామాబాద్ నగరంలోని ఒక త్రిస్టార్ హోటల్ లో వినాయక్ నగర్ కు చెందిన బిల్డర్లు పేకాట క్లబ్ గా మార్చిన విషయం తెల్సిందే. నిత్యం 20 వేల ఆదాయం ఉండడంతో సదరు హోటల్ నిర్వాహకుడు కూడా వారికి గదులను అద్దెకు ఇచ్చి సకల ఏర్పాట్లను చేశారు. టాస్క్ ఫోర్స్ లో పని చేసిన సిఐలకు మామూళ్ళు వెళ్లడంతో ఆ దందా కూడా నిరాటకంగా సాగింది. గత కొన్ని రోజుల క్రితం పోలీసుల రైడ్ లతో పేకాట మూతపడిన విషయం తెల్సిందే. నిజామాబాద్ లో పేకాట ఆడలేమని తెలిసి కొందరు నిర్మల్ జిల్లా అప్పారావుపేట్ కు, నాందేడ్ జిల్లా బిలోలి, దెగ్లూర్ లోని క్లబ్ లకు తరలివెల్లే వారు. అక్కడ పేకాట ఆడడానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడం, నిర్వాహకులు వారికి వాహన ఏర్పాట్లతో పాటు మద్యం, విందు ఏర్పాట్లు చేయడంతో పేకాట ఆట నిరాటకంగా సాగింది. నిజామాబాద్ కు చెందిన మాజీ కానిస్టేబుళే మరికొంత మందితో కలిసి పేకాటను నిర్వహించడంతో జిల్లా నుంచి ప్రతినిత్యం వందల మంది పేకాట ఆడేందుకు వెళ్లేవారు. ఇటీవల అక్కడ అడ్డాలను మూసివేశారు. పోలీసు శాఖ కూడా ఉక్కుపాదం మోపడంతో పత్తాలాట బంద్ అయింది. తాజాగా ఉద్ గిర్ లోని కమలాపూర్ లో కొత్త పేకాట ఆడిస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్ నుంచి 170 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రాంతానికి పేకాటరాయుళ్ళు వెళ్లడం రిస్క్ గా భావిస్తున్నారు.తాజాగా నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో పేకాట ఆడిస్తున్న విషయం లీక్ అయింది. దాంతో పోలీసులు అప్రమత్తం చేయడంతో పేకాట రాయుళ్ళు గుట్టుచప్పుడు కాకుండానే నిష్ర్కమించారు. ఇప్పుడు పేకాట ఆడేందుకు అడ్డాలు లేక తహతహలాడుతున్నారు. తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడడం, గత ప్రభుత్వంలో నిషేదానికి గురైన క్లబ్ లు మళ్ళీ తెరుస్తారని హైదరాబాద్ వెళ్లి పేకాట ఆడుదామని నిర్వాహకులు జూదగాళ్ళను భరోసా ఇస్తున్నారు. స్థానికంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో జూదగాళ్ళు పేకాట ఆడేందుకు అడ్డాలను వెతకడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు షిప్ట్ అవుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.