ఇసుక దందాకు యంత్రాంగం వెన్నుదన్ను..

3,676
  • రికార్డుల కోసం ఒకటి రెండు వాహనాలు సీజ్ చేస్తున్న పోలీసులు
  • స్థానికంగానే వేలం వేస్తున్న రెవెన్యూ అధికారులు
  •  వేలం వేసిన ఇసుకతో అధికారికంగా ఇసుక రవాణా
  • ఉమ్మడి జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా

బతుకమ్మ, నిజామాబాద్ – నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వరప్రదాయిని మంజిరా పరివాహక ప్రాంతంలో ఇసుక దందా నిరంతరంగా సాగుతుంది. ఇటీవల కొందరు ప్రభుత్వానికి, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కామారెడ్డి జిల్లాలో ఇసుక రీచ్ లను రద్దు చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఇసుక తవ్వకాలకు అనుమతులు లేవు. ప్రజల అవసరాల కోసం , ప్రభుత్వ పనుల కోసం మాత్రమే వారానికి రెండు రోజులు అనుమతి ఇస్తున్న విషయం తె ల్సిందే.అయితే ఇసుక దందాలో మునిగి తేలుతున్న వారు ప్రభుత్వ ఉత్తర్వులు ఖతారు చేయడం లేదు. బిచ్కుంద మొదలుకుని రెంజల్ వరకు ఉమ్మడి జిల్లాలో ఇసుక తవ్వకాలు చేస్తునే ఉన్నారు. మంజిరా పరివాహక ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఒడ్డుకు చేర్చి పరివాహక ప్రాంతాల శివారు గ్రామాల్లో డంప్ చేస్తున్నారు. ఒకవేళ పోలీసులు సీజ్ చేసిన వాటిని రెవెన్యూ శాఖకు అప్పజెబుతున్నారు. రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన ఇసుకను వారే వేలం వేస్తున్నారు. మార్కెట్ రేటుప్రకారం ధర నిర్ణయించి ఎక్కడికక్కడ ఇసుక డంప్ లను వేలం వేస్తే ఇసుకను తవ్వి తరలించే వారే వాటిని వేలంలో దక్కించుకుంటున్నారు. అక్కడ రెవెన్యూ అధికారులు ఇచ్చే ట్రాన్సిస్ట్ రిసిప్ట్ (వే బిల్లు)ను చూపుతూ ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చే వే బిల్లు ఆధారంగా సీజ్ చేసిన ఇసుకనే కాకుండా ఇతర ఇసుకను కూడా టిప్పర్లలో తరలిస్తూ దందాను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఇసుక కామారెడ్డి, నిజామాబాద్, బాన్సువాడ, బోధన్ ప్రాంతాలకే కాకుండా అటు మహారాష్ట్రకు ఇటు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. పట్టుబడితే రెవెన్యూ అధికారులు ఇచ్చిన వే బిల్లును చూపి తప్పించుకుంటున్నారు. ఒక్క వే బిల్లుతో పదికి పైగా టిప్పర్లలో ఇసుక తరలిపోతుంది. రెవెన్యూ అధికారులు గానీ, పోలీసులు గానీ తరుచూ పట్టుబడుతున్న వాహనాలు ఇన్ లీగల్ ఇసుక దందాలో ఉన్నాయని గుర్తించకపోవడం వెనుక మతలబు ఉందన్న వాదనలున్నాయి. ప్రభుత్వ ఖజానా నింపుతున్నామని చెబుతున్నప్పటికీ రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతున్నట్లు చెప్పాలి. సాధారణంగా ఇసుక వేలం వేయాలంటే కచ్చితంగా మైనింగ్ శాఖకు సమాచారం ఇవ్వాలి. కానీ అప్పటికప్పుడు రెవెన్యూ అధికారులు, పోలీసులు ఆ తతంగాన్ని పూర్తి చేస్తుండడంతో ఇసుక దందా నిరాటకంగా సాగుతుంది. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, బీర్కూర్ లలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయని చెబుతుండగా అక్కడ ఉన్న డంప్ తరలింపు కార్యక్రమం మాత్రం సాగుతుంది. అదే సమయంలో స్థానికంగా ట్రాక్టర్ల ద్వారా మంజిర నది గర్భం నుంచి ఇసుకను తవ్వి తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతల పేరు చెప్పి ఈ దందా కొనసాగుతునే ఉంది. నిజామాబాద్ జిల్లాలో కోటగిరి, బోధన్ మండలాల్లో ఇసుక తవ్వకాలు సాగుతునే ఉన్నాయి. మంజిరా ఇసుక అటు నిర్మల్ జిల్లాకు తరలిపోతుంది. నిజామాబాద్,కామారెడ్డి జిల్లాలో ఇసుక రవాణా జరిగే వాహనాలు పోలీస్ స్టేషన్ ల ముందు నుంచి వెళ్తున్నా పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి. కేవలం రికార్డుల కోసం పట్టుకుని రెండు, మూడు రోజులు స్టేషన్ లో ఉంచుకుని రెవెన్యూ శాఖకు ఇచ్చి నామమాత్రపు ధరతో వేలంలో ఇసుకను విక్రయించేలా చేస్తూ పరోక్షంగా ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారన్న వాదనలున్నాయి. ఉమ్మడి జిల్లాలో నిర్మాణ రంగం కొనసాగుతుండగా అందుకు అవసరమైన ఇసుక వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిషేదం విధించడంతో దొడ్డిదారిన తవ్వకాలు వాటినే దర్జాగా రహదారుల మీదుగానే తరలించి సొమ్ము చేసుకునే ప్రక్రియ కొనసాగుతునే ఉంది.

Leave A Reply

Your email address will not be published.