- హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
- వర్చువల్ విధానంలో శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన సీ.జే
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : సామాజిక వివాదాల సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తొలిసారిగా 2021 లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించడంతో, దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలలో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వివిధ సామాజిక వర్గాల నుండి కమ్యూనిటీ మీడియేటర్లుగా ఎంపిక చేసిన వారికి గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణ తరగతులను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే లాంఛనంగా ప్రారంభించగా, హైకోర్టు న్యాయమూర్తులు సుజోయ్ పాల్, కె.సురేందర్, జె.శ్రీనివాస్ రావు భాగస్వాములయ్యారు.
ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే మాట్లాడుతూ, సామాజిక వివాదాలు, కుటుంబ తగాదాలు వంటి వాటిని కమ్యూనిటీ మీడియేటర్లు (వాలంటీర్లు) మధ్యవర్తిత్వం ద్వారా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. దీనివల్ల సామాజిక వివాదాలు క్షేత్రస్ధాయిలోనే సత్వరం పరిష్కారమయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. తద్వారా అనవసర ఖర్చుతో పాటు, సమయం వృధా కాకుండా అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను శ్రద్ధగా ఆకళింపు చేసుకుని, సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించాలని, ప్రయోగాత్మకంగా అమలులోకి తెస్తున్న ఈ కార్యక్రమం సత్ఫలితాలు అందించేలా అంకితభావంతో కృషి చేయాలని కమ్యూనిటీ మీడియేటర్లకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ రిసోర్స్ పర్సన్, రిటైర్డ్ సెషన్స్ జడ్జి మొహమ్మద్ షమీమ్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరీ, నిజామాబాద్ జిల్లా సెషన్స్ జడ్జి సునీతా కుంచాల, కామారెడ్డి సెషన్స్ జడ్జి వి.ఆర్.ఆర్.వరప్రసాద్, నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, న్యాయాధికారులు, రెండు జిల్లాలకు చెందిన కమ్యూనిటీ వాలంటీర్లు పాల్గొన్నారు.
