పనితీరులో మార్పు రావాలి

1,477

. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచన

. ముదక్ పల్లి పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ

. వైద్యులు, సిబ్బంది గైర్హాజరుపై అసంతృప్తి

. పీహెచ్ సీలను గాడిలో పెట్టాలని డీఎంహెచ్ వోకు ఆదేశం

 

నిజామాబాద్, బతుకమ్మ: వైద్యారోగ్య శాఖ పనితీరులో మార్పురావాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మోపాల్ మండలంలోని ముదక్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలతోపాటు ఔషధాలు నిలువ ఉంచిన స్టోర్ రూమ్, ఇన్ పేషంట్ వార్డు, ల్యాబ్ ను, రిజిస్టర్లను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందిపై ఆరా తీసిన కలెక్టర్ పలువురు గైర్హాజరయ్యారని గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్ సీ పరిధిలో ఎక్కువ సంఖ్యలో డెంగీ కేసులు నమోదు కావడానికి కారణాలు ఏమిటని వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్ సీలు, ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని, ప్రతిరోజూ ఉదయం వేళలోనే అటెండెన్స్ ను పర్యవేక్షించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖలో స్పష్టమైన మార్పు కనిపించాలని, క్షేత్ర స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరును గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఏదైనా పీహెచ్ సీలో  వైద్యాధికారి సెలవులో ఉంటే, ఇతర ఆసుపత్రుల నుంచి ప్రత్యామ్నాయంగా వైద్యులను సర్దుబాటు చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యానికి తావుండకూడదని అన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున వైద్యులు, సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని సూచించారు. పాము కాటు, కుక్కకాటు మందులతోపాటు అన్ని అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.