- జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్
బతుకమ్మ, నిజామాబాద్ : క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు కు అనుగుణంగా నియమ నిభందనలు పాటిస్తూ ప్రైవేట్ ఆసుపత్రులు పని చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ -2010 సీజనాల్ వ్యాధులపై ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైన మాట్లాడారు. ప్రతినెలా సమయానికి రిపోర్ట్ చేయడమే కాకుండా డిస్టిక్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఆధ్వర్యంలో అన్ని ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాలన్నారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా డెంగ్యూ వ్యాధి నియంత్రణలో ప్రైవేట్ ఆస్పత్రులన్నీ ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. డెంగ్యూ నిర్ధారణ కోసం కొన్ని ప్రైవేటు ఆసుపత్రులలో కేవలం ఆర్డిటి టెస్ట్ ద్వారా పరీక్షించిన తర్వాత డెంగ్యూ నిర్ధారణ అయినట్లు తెలుపుతున్నారన్నారు. కేవలం ఆర్డిటి ద్వారా పరీక్షలు చేయడమే కాకుండా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఎలీషా పరీక్ష నిమిత్తం రిఫర్ చేయాలని ఎలీషా పరీక్ష తర్వాతనే డెంగ్యూ నిర్ధారణ అవుతుందన్నారు. జిల్లాలో రోజురోజుకు కొత్తగా డెంగ్యూ కేసులు నమోదవుతున్న తరుణంలో అన్ని ఆసుపత్రుల వైద్యులు తప్పకుండా దీనిపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు పాల్గొన్నారు.
