మెరిటా? సీనియార్టీయా?

976

. ఎక్సైజ్  పదోన్నతుల జాబితా రూపకల్పనకు బ్రేక్

. అబ్కారీ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన కానిస్టేబుళ్లు

. కోర్టులో కేసు పెండింగ్ ఉండగా పదోన్నతుల ప్రయత్నాలపై కానిస్టేబుళ్ల గుస్సా

.మొదటికి వచ్చిన ఎక్సైజ్ పదోన్నతుల ప్రక్రియ

 బతుకమ్మ, నిజామాబాద్:

రాష్ర్ట వ్యాప్తంగా గత ఐదారు సంవత్సరాలుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్ల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ నెలలోనే పదోన్నతుల కోసం రూపొందిస్తున్న సీనియారిటీ జాబితాకు బ్రేక్ పడింది. అన్ని జిల్లాల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ల ఆధ్వర్యంలో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నుంచి హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులకు సీనియార్టీ జాబితాను తయారు చేస్తుండగా దానిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.  పదోన్నతుల జాబితా మెరిట్ ప్రకారమా? లేక సీనియార్టీ ప్రకరమా?  అనే సందేహలు ఎక్సైజ్ శాఖలో నెలకొన్నాయి. దీనిపైనే కొందరు ఆరు సంవత్సరాల క్రితం న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటికీ కేసు కోర్టులో ఉండగా, మళ్లీ పదోన్నతుల జాబితాను సిద్ధం చేస్తుండడంతో అన్ని జిల్లాలో కానిస్టేబుళ్లు ఎక్సైజ్ కమిషనర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో జాబితా రూపకల్పనకు బ్రేక్ వేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాత పోస్టులను యథావిధంగా కొనసాగించాలని నిర్ణయించడంతోపాటు కమిషనర్ ఈ మేరకు ఈ ఎస్ లకు  ఆదేశాలు జారీ చేయడంతో పదోన్నతుల ప్రక్రియకు తాత్కాలికంగా నిలపివేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 140 మందికి పదోన్నతులు లేకుండా పోయాయి.  నిజామాబాద్ జిల్లాలో 80 మంది, కామారెడ్డి జిల్లాలో 60 బంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమోషన్ ల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 1995లో ఏపీపీఎస్సీ ద్వారా కొందరు రిక్రూట్ అయ్యారు. ఆ నాడు మద్య నిషేధం అమలులో ఉండటం, ఎక్సైజ్ శాఖలో ఖాళీల కొరత నేపథ్యంలో ప్రత్యేక జీవో ద్వారా ప్రతి జిల్లాకు 100 మంది వరకు ఎంపిక చేశారు. వారు పది సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత పదోన్నతుల విషయంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగాల్లో చేరిన వారికి,  ఏపీపీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన కానిస్టేబుళ్లకు మధ్య వివాదం నెలకోంది. పోలీస్ కానిస్టేబుళ్లు తమ పది సంవత్సరాల సీనియార్టీని వదులుకుంటామని 2009లో ఆనాడు వైఎస్ ప్రభుత్వంలో రాజీకి వచ్చారు. ఇప్పడు వారికి పదోన్నతులు వచ్చే సరికి  1995 రిక్రూట్ సమయంలో రాత పరీక్ష లేదు కాబట్టి ఖచ్చితంగా సీనియార్టి తీసుకోవాలని కొందరు, కాదు మెరిట్ ప్రకారం తీసుకోవాలని మరి కొందరు వాదిస్తుండటంతో పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. ఎక్సైజ్ శాఖలో 1994లో రిక్రూట్ అయిన వారికి 2009  నుంచి 2013 వరకు పదోన్నతులు ఇచ్చారు. కాని స్సెషల్ కేటగిరిలో వచ్చిన వారితోనే పదోన్నతుల  ప్రక్రియకు పేచీ ఉండటంతో అది వాయిదా పడుతూ వస్తున్నది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎదురు చూసిన వారికి మళ్లీ నిరాశ తప్పలేదు.

Leave A Reply

Your email address will not be published.