- అభ్యంతరాలు స్వీకరించిన గత జాబితా వైపే మొగ్గు
- సీసీఎల్ఏ చుట్టూ బాధితుల చక్కర్లు
- సరి చేయకపోతే డీటీలకు కోర్టే శరణ్యం
బతుకమ్మ నిజామాబాద్ : నాయబ్ తహశీల్దార్ నుంచి తహసిల్దార్ పదోన్నతి కోసం పొందుపరిచిన జాబితాలో తప్పులు దొర్లినట్లు బాధితులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏడు జోన్లలోని డి టి (నాయక తహశీల్దార్ )లకు సీనియారిటీ ప్రకారం పదోన్నతి కల్పించాలని రాజధానిలో ఉన్న సిసిఎల్ఏ కార్యాలయంలో జాబితాను తయారు చేశారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి తహసిల్దార్ వరకు బదిలీలు గాని, పదోన్నతులు గాని సీసీఎల్ఏ నుంచే జరుగుతాయని ఆ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో నాయబ్ తహసిల్దార్ నుంచి తహసిల్దార్ పదోన్నతి పొందవలసిన వారి జాబితాను ప్రధాన కార్యాలయంలో రూపొందించారు. అలా తయారుచేసిన జాబితాను 2023 అక్టోబర్ లో బహిర్గతం చేసి దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఆయా జిల్లాల కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందించారు.
అభ్యంతరాలు స్వీకరించినా : ఇందులో తమ పేరు ఎక్కడ ఉందో చూసుకున్న వారికి గుండె గుబేలుమన్నంత పని అయింది. తనకు అన్యాయం జరిగిందని, సీనియర్టీని తప్పుగా ప్రకటించారని అనేక తరహాలో అభ్యంతరాలను దరఖాస్తు రూపంలో ఇచ్చి రశీదు తీసుకున్నారు. ప్రధాన కార్యాలయంలో తప్పులు దొర్లాయని గ్రహించిన అధికారులు శాసనసభ ఎన్నికల ప్రకటన వెలువడిందనే వంకతో జాబితాను పక్కన పెట్టేశారు.
సీసీఎల్ఏ చుట్టూ బాధితుల చక్కర్లు : ప్రస్తుతం రూపొందించిన పదోన్నతి జాబితాలో జరిగిన పొరపాటును సరి చేయకపోతే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే బాధతో సీసీఎల్ఏ చుట్టూ నాయబ్ తహసిల్దారులు చక్కర్లు కొడుతున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దాలని అనేకమార్లు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీటీలు ప్రధాన కార్యాలయానికి వ్యక్తి గతంగా వెళ్లి అధికారులను కలిసి మొరపెట్టుకుంటున్నారు.
పాత జాబితా వైపే మొగ్గు : పదోన్నతి జాబితా లో దొర్లిన తప్పులను సరిదిద్దాలని పలుమార్లు డీటీలు కోరిన స్పందన కరువైంది. గతంలో ఇచ్చిన అభ్యంతరాలను స్వీకరించినప్పటికీ వాటిని తుంగలో తొక్కేశారు. ఇవన్నీ కాదని పాత జాబితానే తెరమీదకి తీసుకొచ్చేందుకు ప్రధాన అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నాయబ్ తహసిల్దార్ లు సీసీఎల్ఏ లోని ప్రధాన కార్యాలయంలో సంబంధిత అధికారులను నిలదీయడంతో అభ్యంతరాలపై మరో మారు ఆర్జీలను ఇవ్వాలని డీటీలకు సూచించారు. చేసేదేమి లేక గతంలో ఇచ్చిన అర్జీ రశీదును జతపరచి మరోసారి దరఖాస్తును వారం రోజుల కింద అందజేశారు.
న్యాయం జరగకపోతే కోర్టే శరణ్యం : పదోన్నతి జాబితాలో తమకు అనుకూలమైన వారి పేర్లను పొందుపరిచారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. దొర్లిన తప్పులను సరిచేయాలని కోరుతూ రెండుసార్లు అభ్యంతరాలు తీసుకున్నప్పటికీ ఇంతవరకు సీసీఎల్ఏ ఉన్నతాధికారులు న్యాయం చేయలేకపోతున్నారని ఆవేదనను వెలిబుచ్చారు. నాయబ్ తహసిల్దార్ నుంచి తహసిల్దార్ పదోన్నతి విషయంలో అక్రమాలు జరిగితే దీనిపై కోర్టుకు వెళ్లడమే శరణ్యమని డీటీలు భావిస్తున్నారు.