- టిఎస్ యూటీఎఫ్.డిస్ట్రిక్ట్ సెక్రటరీ మల్క జనార్దన్
బతుకమ్మ, భీమ్ గల్ – రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చాలంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చెయ్యాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మల్క జనార్దన్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం యు టీ ఎఫ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవం సందర్భంగా మీడియా తో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కు పునాది అయిన ప్రైమరీ స్కూల్స్ లో తెలుగు, ఇంగ్లీష్ మధ్యమాలను ప్రవేశపెట్టిన, బోధన, బోధనేతర పోస్టలను భర్తీ చేయాలన్నారు. పూర్తి స్థాయిలో మౌళిక వసతులను ఏర్పాటు చేసి తరగతికి ఒక్క టీచర్, అన్ని స్కూల్స్ ల్లో పదోన్నతులపై హెడ్ మాస్టర్ల నియామకం చేపట్టాలన్నారు. అనంతరం యు. టీ. ఎఫ్ గురించి మాట్లాడుతూ
1974 ఆగస్టు 10వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని మేనేజ్ మెంట్లను, అన్ని క్యాడర్లను మరియు అన్ని ప్రాంతాలను కలుపుకొని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్రవ్యాప్త సంఘంగా ఆవిర్భవించిందని ఆయన తెలియజేశారు. యూటీఎఫ్ వ్యవస్థాపకులు చెన్నుపాటి లక్ష్మయ్య సారథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయులందరినీ ఏకం చేసి రీ గ్రూపింగ్ స్కేల్ సాధించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు అంటేనే భయపడే స్థితిని పోగొట్టి 1998వ సంవత్సరంలో కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల బదిలీల పద్ధతికి యూటీఎఫ్ ఎనలేని కృషి చేసిందని ఆయన పేర్కొన్నారు. అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయడంలో యూటీఎఫ్ కీలకపాత్ర వహించిందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడుగురు పిడిఎఫ్ ఎమ్మెల్సీలతో అతిపెద్ద సంఘముగా ఆవిర్భవించిందని అన్నారు.
9వ పిఆర్సీ సాధనలో యూటీఎఫ్ కీలకపాత్ర వహించి బతకలేని బడి పంతులు నుండి బతకగలిగే బడి పంతులు అనే విధంగా చేసిందని అన్నారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో యూటీఎఫ్ రెండు రాష్ట్ర కమిటీలుగా విడిపోయి ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు మరియు విద్యాభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తూ ఉందని అన్నారు. 2014లో 18 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉత్తర, దక్షిణ తెలంగాణలో విద్యా యాత్రను చేపట్టి సెప్టెంబర్ 24వ తేదీన రవీంద్రభారతి లో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసదస్సును నిర్వహించి నాటి విద్యాశాఖ మంత్రికి విద్యా డాక్యుమెంటును (విధాన పత్రాన్ని) అందజేయడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిలబడాలంటే అన్ని ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మాధ్యమంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించాలని, పాఠశాలలో ఉన్న అన్ని ఖాళీలను నింపాలని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి తో పాటు తరగతికొక ఉపాధ్యాయుడు ఉండాలని సూచించడం జరిగిందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా నిర్వహించాలని డాక్యుమెంట్ లొ తెలియజేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. 2004 సెప్టెంబర్ తర్వాత నియామకమైన ఉపాధ్యాయులు నూతన పెన్షన్ విధానంలోకి రావడం వలన అనేక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని యు టీ ఎఫ్ అనేక పోరాటాలు చేసిందన్నారు.