బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: ఇందిరమ్మ రాజ్యమంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను, రైతులను ముంచిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, ఐదు డిక్లరేషన్లు తదితర 420 హామీలతో ప్రజలను, రైతులను మోసం చేసిందన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి సాక్షిగా కాంగ్రెస్ అధినేత రాహుల్ ఇచ్చిన హామీలకు విలువే లేదన్నారు. బీ ఆర్ ఎస్ హయాంలో తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానంలో ఉంటే, కాంగ్రెస్ రైతులను మోసం చేయడంలో మొదటి స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. రైతు భరోసా, పంట బోనస్ ఇవ్వడం లేదని, ఇదేనా కాంగ్రెస్ రైతు రాజ్యం అని ప్రశ్నించారు. రైతులు బ్యాంకుల ఎదుట ధర్నాలు చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. బీజేపీ రైతు పక్షపార్టీ అని, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత రైతును రాజును చేసేందుకు అనేక సంక్షేమ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు భరోసాగా పసల్ భీమా పథకం ద్వారా ఎకరానికి 20 వేల నష్టపరిహారం తెచ్చింది బీజేపీ ప్రభుత్వమన్నారు. అదేవిధంగా సబ్సిడీపై యూరియా అందిస్తున్నదన్నారు.