బతుకమ్మ, నిజామాబాద్ : నగర శివారులోని నాగారం బొందెం చెరువు కబ్జాల వెనుక బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ నాయకుల హస్తం ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. చెరువు భూమిని కబ్జా చేసి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి ప్రజలను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మోసపోయిన ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు.
ఐదు రోజులకు స్పందించిన ఎమ్మెల్యే
బొందెం చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణలను కూల్చిన ఐదు రోజులకు ఎమ్మెల్యే ధన్ పాల్ స్పందించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కనీసం ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడం, బాధితులను పరామర్శించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సమస్యను రాజకీయాలకు వాడుకోవద్దని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మొదటి నుంచి బాధితులకు ఎంఐఎం అండగా నిలువగా, కాంగ్రెస్ అర్బన్ ఇన్చార్జి, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వారితో ఫోన్ లో మాట్లాడారు. పేదలను మోసం చేసిన వారిపై చర్యలు తప్పవని, బాధితుల్లో అర్హుల కోసం ఇందిరమ్మ కాలనీని ఏర్పాటు చేస్తామన్నారు.