- రసవత్తరంగా యువజన కాంగ్రెస్ ఎన్నికలు
- ఆన్ లైన్ లో సభ్యత్వ నమోదు జోరు
- సభ్యత్వ నమోదు చేసుకున్న వారికే ఓటు హక్కు
- బట్టబయలవుతున్న గ్రూప్ రాజకీయాలు
బతుకమ్మ,నిజామాబాద్
నిజామాబాద్ యువజన కాంగ్రెస్ ఎన్నికలు మునుపెన్నడు ఊహించని విధంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు సర్వసాధారణమైన ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం యువజన కాంగ్రెస్ నాయకుల గెలుపు బాధ్యతను బీజేపీ క్యాడర్ ఎత్తుకోవడమే కలకలం రేపుతుంది. నిజామాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం నాయకులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. గ్రూప్ రాజకీయాలు బహిర్గతమౌతున్నాయి. కానీ తొలిసారి కాంగ్రెస్ యువజన నేతను ఎన్నుకునేందుకు బీజేపీ తరపున ప్రచారం జరుపుతుండడం కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదు. హేమాహేమీలు నాయకులుగా ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి యువజన నేత ఎన్నిక ఇప్పుడు మలుపులు తిరుగుతుంది. జులై 11 నుంచి 22 వరకు యువజన కాంగ్రెస్ పదవుల కోసం నామినేషన్లు స్వీకరించారు. 24 నుంచి 28 వరకు పరిశీలన తర్వాత తుది జాబితా ప్రకటించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆరుగురు బరిలో ఉన్నారు. అందులో ప్రధానంగా నిజామాబాద్ నుంచి విపుల్ గౌడ్, బాల్కొండ నుంచి నాగేంద్ర, నిజామాబాద్ రూరల్ నుంచి నరేష్ లతో పాటు తలపడుతున్నారు. మరో ముగ్గురు కూడా బరిలో ఉన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి 19 మందికి పోటీ పడుతున్నారు.గత నెల 14 నుంచి సభ్యత్వ నమోదు, ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. సభ్యత్వ నమోదు ఆన్ లైన్ లో చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి 35 ఏళ్ళ లోపు యువజనులకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. సభ్యత్వ నమోదు, ఓటింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 14 వరకు జరుగనుంది.తర్వాత ఓట్ల లెక్కంపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ఇద్దరు యువ నేతలు నువ్వానేనా అన్న రీతిలో తలపడుతున్నారు. నిజామాబాద్ నుంచి విపుల్ గౌడ్, బాల్కొండ నుంచి నాగేంద్రలు సై అంటై సై అని కత్తులు దూస్తున్నారు. ఎవరికి వారే గాడ్ ఫాదర్ లను నమ్ముకుని బరిలో నిలిచారు. కాంగ్రెస్ లో అగ్రనేతల మద్దతు ఉందని ఎవరికి వారుప్రచారం చేసుకుంటూ సభ్యత్వ నమోదులో దూసుకుపోతునే ఓట్లు వేయించుకోవడంలో మిగితా వారి కంటే ముందు వరుసలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సభ్యత్వ నమోదు ఓటింగ్ ప్రక్రియలో బాల్కొండ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. ఇద్దరు నేతలకు నాగేంద్ర సన్నిహితుడు అని ప్రచారం జరుగుతుండగా మరో నేత ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించడంతో సొంత నియోజకవర్గంలోనే గ్రూపు రాజకీయాలు బహిర్గతమయ్యాయి. ఇదిలా ఉండగా బోధన్ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ ప్రచారం చేయడం బరిలో నిలిచిన మరొకరిని ఖంగుతినిపించింది. యువజన కాంగ్రెస్ నేతకు ఉన్న సంబంధాల నేపథ్యంలోనే బీజేపీ నాయకులు ఆయన గెలుపును భుజాల పైకి ఎత్తుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. యువజన కాంగ్రెస్ లో ప్రస్తుతం జరుగుతున్న సభ్యత్వంలో బీజేపీ యూత్ ను సభ్యులుగా చేర్చి ఓట్లు వేయించే ప్రక్రియ జరుగుతుందన్న ప్రచారం జోరందుకుంది. ఇదే విషయాన్ని బరిలో ఉన్న మరో యువనేత మాజీ మంత్రి జిల్లా పెద్ద దిక్కుకు మొర పెట్టుకున్నట్లు తెలిసింది. యువజన కాంగ్రెస్ నేత కోసం బీజేపీ ప్రచారం చేయడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొత్తగా సభ్యత్వ నమోదు యుజవన కాంగ్రెస్ ను బలోపేతం చేస్తే బీజేపీకి వచ్చే లాభం ఏంటనే ప్రశ్నను కాంగ్రెస్ యువజన క్యాడర్ ఎత్తుకుంది. కానీ గెలుపొటములకు ఓటింగే ప్రాథమిక లక్ష్యంగా సభ్యత్వ నమోదును ఆన్ లైన్ లో చేస్తుండడంతో ఎవరు ఏ పార్టీ వారో సంబంధం లేకుండా సభ్యత్వం ఇస్తున్నారని ఇదే జరిగితే యువజన కాంగ్రెస్ నాయకుడి ఎంపికలో బీజేపీదే కీలక పాత్ర అని చెప్పాలి. ఓ యువనేత తమ స్నేహితుడు కోసం గతంలో నుంచి ఉన్న సంబంధాల నేపథ్యంలోనే బీజేపీ యూత్ ను కాంగ్రెస్ యూత్ గా సభ్యత్వ నమోదు చేయించి గెలుపు బాధ్యతను ఎత్తుకున్నాడని కాంగ్రెస్ యువనేతలు ఆరోపిస్తున్నారు. యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో జరుగుతున్న ఈ తతంగాన్ని యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు, ఓటింగ్ ప్రక్రియ జరుగుతుండగా మరో 12 రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగితే మాత్రం యువజన కాంగ్రెస్ ఎన్నికలు గతంలో ఎన్నడు లేని విధంగా జరుగుతాయని చెప్పడంలో సందేహం లేదు.
Prev Post