సర్వాయి పాపన్నగౌడ్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలి

471

…జయంతి వేడుకలలో వక్తలు

బతుకమ్మ, నిజామాబాద్ సిటి

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్ లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పి.సుదర్శన్ రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ, రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి, మాజీ ఎమ్మెల్సీ  వి.గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐడీసీఎంఎస్ ఛైర్మన్ తారాచంద్ నాయక్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, పోరాట యోధుడు పాపన్నగౌడ్ జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్యాయాన్ని ఎదురించేందుకు సర్వాయి పాపన్న గౌడ్ కనబర్చిన పోరాట తెగువ అనన్యసామాన్యమైనదని కొనియాడారు. మొఘల్ రాజుల కాలంలో దౌర్జన్యాలు, అణిచివేతలకు వ్యతిరేకంగా సమర శంఖం పూరించిన ధీశాలి సర్వాయి పాపన్న మహరాజ్ అని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకుని బహుజనులంతా ఏకతాటిపైకి చేరి తమ హక్కుల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.  సమస్యల పరిష్కారం కోసం గౌడ సోదరులు ఐకమత్యంతో కృషి చేయాలన్నారు. ఐ.డీ.ఓ.సీ లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి మాట్లాడుతూ, రాచరిక వ్యవస్థ కొనసాగుతున్న ఆ రోజుల్లో కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న ఓ సాధారణ వ్యక్తి కుల వృత్తిపై పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ అసామాన ధైర్య సాహసాలతో పోరాటం చేయడం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని సర్వాయి పాపన్న తెగువను కొనియాడారు. నాటి దౌర్జన్యాలను ఎండగడుతూ వేలాది మందితో సైన్యాన్ని సమీకరించుకుని పన్నుల వ్యవస్థ లేని గొప్ప పరిపాలనను అందించారని కొనియాడారు. మొఘల్ రాజులను ఎదురించి గోల్కొండ కోటను సైతం పాలించడం సర్వాయి పాపన్న ధైర్య సాహసాలను చాటుతోందన్నారు. సర్వాయి పాపన్నగౌడ్ మార్గదర్శకత్వం ఎంతో అనుసరణీయమని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా సామాన్యులకు ఫలాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అందరూ సమానులేననే భావన పెంపొందేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు.  గీత కార్మికులు సమిష్టిగా ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయాగౌడ్, బీసీ సంక్షేమ  శాఖ అధికారిణి స్రవంతి, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గీత వృత్తిదారులు పాల్గొన్నారు.

 

Sarvai Papannagoud should go forward with fighting spirit

Leave A Reply

Your email address will not be published.