. తెగిన రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు చేపట్టండి
. ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపండి
. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బతుకమ్మ, భీమ్ గల్: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు చేపట్టి ప్రజారవాణాను సత్వరమే పునరుద్ధరించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షం కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు గురువారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. కమ్మర్ పల్లి మండలం లోని కోనసముందర్ – అమీర్ నగర్ వెళ్లే రోడ్డును బైక్ పై వెళ్లి పరిశీలించారు. వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, మినీ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన ఉద్యమ నాయకురాలు యమునమ్మ ఇటీవల మరణించగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుంచి కమ్మర్ పల్లి మండల కేంద్రానికి చెందిన రెండు బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం కమ్మర్ పల్లి నుంచి ఉప్లూర్ వెళ్లే రోడ్డులో వరద కాలువ దిగువన కల్వర్టు వద్ద తెగిపోయిన రోడ్డు ను పరిశీంచి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అనంతరం తాళ్ళారాంపూర్ లో ఓ భాదిత కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుండి బయల్దేరిన వేముల.. వేల్పూర్ మండలం రామన్నపేట్ నుంచి వేల్పూర్ మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు తెగిపోవడం తో ఆ రోడ్డును పరిశీలించారు. ఆయన వెంట పలువురు తాజా మాజీలు, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.