బొందెం చెరువు కబ్జాలపై పోలీస్ శాఖ కొరడా

2,608
  •  బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్తతోపాటు ఐదుగురి అరెస్ట్
  •  పరారీలో నలుగురు
  • కేసు విచారణ కొనసాగుతోందంటున్న పోలీసులు

బతుకమ్మ, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని బొందెం చెరువు ఆక్రమణలపై అధికార యంత్రాంగం కొరడా ఝుళిపించగా,  పోలీసుశాఖ బాధ్యులపై చర్యలు తీసుకుంటోంది. పదో డివిజన్ కార్పొరేటర్ కోమలి భర్త నరేశ్ తోపాటు నకిలీ పట్టాలు తయారుచేసిన కోటగల్లి జావిద్, స్థానిక మహిళా లీడర్ కమలమ్మ, బీ ఆర్ ఎస్ నాయకుడి ప్రధాన అనుచరుడైన మక్కల గోపాల్, మస్తాన్ ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

కూల్చివేత నుంచి కేసుల వరకు..

బొందెం చెరువును ఆక్రమించి కట్టిన 27 ఇళ్లను గత నెల 17న రెవెన్యూ శాఖ అధికారులు పోలీసుల సహాయంతో  కూల్చి వేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, దళారులు, నకిలీ పట్టాలు తయారు చేసేవారు కుమ్మక్కై తమకు చెరువు శిఖం భూమిలో ప్లాట్లు విక్రయించారని బాధితులు ఆరోపించారు. 18వ తేదీన ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు 10 మందిపై ప్రాథమికంగా కేసు నమోదు చేశారు. గత నెల19న  నాలుగు సెక్షన్ల కింద 10 మందిపై కేసులు నమోదు చేశారు.  ఈ కేసులో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కోమల్ భర్త నరేశ్ తోపాటు కోటగల్లీకి చెందిన జావిద్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో పట్టాలు తయారు చేశారని, మరో బీ ఆర్ ఎస్ నేత ప్రధాన అనుచరుడు, నాగారం ప్రాంతానికి చెందిన మక్కల గోపాల్, మస్తాన్ మరో ఐదుగురు కలిసి పేదలకు ప్లాట్లు విక్రయించారని గుర్తించారు. అందులో భాగంగా కోటగల్లీకి చెందిన జావిద్ నిర్వహిస్తున్న ఆన్ లైన్ సెంటర్ పై దాడి చేసి నకిలీ పట్టా పాస్ పుస్తకాలతోపాటు ఫోర్జరీకి ఉపయోగించిన దస్త్రాలను, స్టాంపులను సీజ్ చేశారు. పోలీసులు తొలివిడతలో ఐదుగురిని అరెస్టు చేశారు. నకిలీ పట్టాల వ్యవహారంలో బాధ్యులైన వారిని అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని ఎంఐఎం నాయకులు జిల్లా కలెక్టర్ తో పాటు పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కేసులో ప్రధాన సూత్రధారిని తప్పించారనే ఆరోపణలు వ్యక్తం కాగా, కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కై పేదలను ముంచాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు.  ఈ క్రమంలో నకిలీ పట్టాల వ్యవహారంలో కేసు నమోదవుతుందా? బాధ్యులపై చర్యలు తీసుకుంటారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ పోలీస్ బాస్ సీరియస్ గా ఉండడంతో పకడ్బందీ విచారణతోపాటు బాధ్యల అరెస్టుకు పక్కా ప్రణాళిక వేశారు. అందులో భాగంగా కీలక సూత్రధారులను పట్టుకొని విచారణ ముందుకు తీసుకెళ్తున్నారు. మంగళవారం ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

Leave A Reply

Your email address will not be published.