భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

1,266
  • కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : గత కొన్ని రోజుల నుండి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, రానున్న ఐదు రోజులు మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి మంగళవారం భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన ఆర్.ఓ.ఆర్ ముసాయిదా బిల్లు-2024 పై వర్క్ షాప్ ఏర్పాటు, ధరణి, ఎల్.ఆర్.ఎస్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. జిల్లాలో వర్షాల వల్ల నెలకొని ఉన్న పరిస్థితుల గురించి సంబంధిత శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం కురిసిన కుండపోత వర్షానికి జిల్లా కేంద్రంలోని కంఠెశ్వర్ కమాన్ వద్ద వర్షపు జలాలు నిలిచిపోయి ఒకింత ఇబ్బందులు ఎదురైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాధారణ జన జీవనానికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నష్టం వంటివి వాటిల్లకుండా వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు నీట మునగడం, విద్యుత్ తీగలు తెగిపోవడం, కరెంటు స్తంభాలు కూలితే వాటి పునరుద్ధరణ పనులను తక్షణమే జరిపించాలని ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్ ను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా సాధారణ స్థాయిలోనే ఉందని అన్నారు. అయినప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా రానున్న ఐదు రోజులలో భారీ వర్షాలు కురిస్తే, వర్ష ప్రభావిత ప్రాంతాల నుండి ఏదైనా సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలని అధికారులకు హితవు పలికారు.
కాగా, ధరణి సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఆర్.ఓ.ఆర్ ముసాయిదా బిల్లు-2024 పై ప్రజల నుంచి సీసీఎల్ఏ వెబ్సైట్ (www.ccla.telangana.gov.in) ద్వారా సూచనలు, సలహాలు స్వీకరించడం జరుగుతోందని అన్నారు. దీనిపై జిల్లా స్థాయిలోనూ మేధావులు, రెవెన్యూ చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్న వారితో వర్క్ షాప్ నిర్వహించి, వారి నుండి సేకరించిన అభిప్రాయాలను క్రోఢీకరించి సీసీఎల్ఏ ప్రిన్సిపల్ సెక్రెటరీకి పంపించేలా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టరేట్ అధికారులను ఆదేశించారు. ధరణి, ఎల్.ఆర్.ఎస్ పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు చొరవ చూపాలని, వారం పది రోజుల్లోపు అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, పంచాయతీరాజ్, వ్యవసాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, ఇరిగేషన్, ట్రాన్స్కో, మున్సిపల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.