- యువతిని వేధిస్తున్నాడని పోలీసు కేసు
- అవమాన భారమా? పోలీసు దెబ్బలు కారణమా?
బతుకమ్మ, నిజామాబాద్ క్రైం: నగరంలోని కుమార్ గల్లీకి చెందిన సునీల్(23) తన దుకాణంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యువతిని వేధిస్తున్నాడని సునీల్ పై రెండు రోజుల క్రితం నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసు విచారణ నిమిత్తం సునీల్ ను సోమవారం పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించినట్లు తెలిసింది. వ్యక్తిగత పూచీకత్తుపై రాత్రి వేళ్ల స్టేషన్ నుంచి వెళ్లిపోయిన సునీల్ కుమార్ గల్లీలోని తాను నడుపుతున్న జనరల్ స్టోర్ లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలోనూ సునీల్ యువతిని వేధించాడని స్టేషన్ కు పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఈసారి మాత్రం కేసు నమోదు కావడం, పోలీసులు విచారించడాన్ని అవమానభారంగా భావించిన సునీల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు. అయితే విచారణ నిమిత్తం స్టేషన్ కు తీసుకెళ్లిన సునీల్ ను కొట్టడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ లో సునీల్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం సునీల్ డెడ్ బాడీని జీజీహెచ్ కు తరలించారు.