. . . 35 కేసులలో 59 ట్రాన్స్ ఫార్మర్ల చోరిల కేసులు కొలిక్కి
బతుకమ్మ, బాన్సువాడ : మెదక్, కామారెడ్డి జిల్లాలో 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ఎత్తుకెళ్తున్న ఏడుగురు సభ్యుల ముఠాలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 2న నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లి చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలంముస్లాపూర్ కు చెందిన ఊబిడి లింగయ్య ఆలియాస్ నాని, చిత్తారి రమేష్, తూరపాటి యేసు, దాసరి రాజు, తూరపాటి అంబయ్యలను పట్టుకుని విచారించడంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలో 8 పోలీస్ స్టేషన్ ల పరిధిలో జరిగిన 35 కేసుల్లోని 59 ట్రాన్స్ ఫార్మర్ల నుంచి రాగితీగల చోరి కేసులు కొలిక్కి వచ్చాయని చెప్పారు. వీరితో పాటు పాపయ్య, పోచయ్య అనే ఇద్దరు కూడా ట్రాన్స్ ఫార్మర్ కాయిల్స్ చోరిలో ఉన్నారని పాపయ్య మర్డర్ కేసులో జైలులో ఉండగా, పోచయ్య ఆచూకీ దొరకలేదని తెలిపారు. వారి వద్ద నుంచి 6 లక్షల విలువైన కాపర్ కాయిల్ రికవరి చేసినట్లు తెలిపారు. కాపర్ కాయిల్స్ ను మహారాష్ట్రలోని దెగ్లూర్ లో అమ్మేందుకు వెళ్తుండగా నిజాంసాగర్ ఎస్సై సుధాకర్ వారి సిబ్బంది పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో బాన్సువాడ రూరల్ సిఐ సత్యనారాయణ, నిజాంసాగర్ ఎస్సై సుధాకర్, సిబ్బంది ఉన్నారు.