జీజీహెచ్ ఆకస్మిక తనిఖీ

1,669

బతుకమ్మ, నిజామాబాద్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ విభాగాలను, ఫీవర్ వార్డు, ఆపరేషన్ థియేటర్, శస్త్ర చికిత్స వార్డు, రక్త నిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, ఎలిసా టెస్ట్ సెంటర్, టీ.హబ్ సెంటర్ తదితర వాటిని సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. ప్రతిరోజూ సగటున ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు, వారిలో ఎంతమంది ఇన్ పేషంట్లుగా అడ్మిట్ అవుతున్నారు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటి వాటితో ఎంతమంది ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ ను అడిగి తెలుసుకున్నారు. రోగుల అవసరాలకు సరిపడా మందులు, ప్లాస్మా, ప్లేట్ లెట్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జీజీహెచ్ లోని అధునాతన వైద్య పరికరాలు, ఎలిసా టెస్టింగ్, ప్లాస్మా, ప్లేట్లెట్స్  సెపరేషన్ తదితర యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. జీజీహెచ్ లో మౌలిక వసతుల మెరుగుదలకు సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి రాజశ్రీ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.