బతుకమ్మ నందిపేట్: నందిపేట్ మండలం ఖు ద్వాన్పూర్ గ్రామానికి చెందిన సుకృత్ (22) అనే యువకుడు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాదకర సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే, సుకృత్ గత ఏడాది రజిత అనే యువతితో కులాంతర వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో, శుక్రవారం నందిపేట్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అనంతరం భార్య రజిత తన భర్త సుకృత్ వద్దకు తిరిగి వెళ్లడానికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన సుకృత్, శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, అప్పటికే మందు తాగడంతో సుకృత్ను హుటాహుటిన మండల కేంద్ర ఆసుపత్రికి తరలించి, అక్కడి నుండి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతుండగానే సుకృత్ ఆదివారం ఉదయం మరణించాడు. అనంతరం సుకృత్ భౌతిక కాయాన్ని భార్య రజిత తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉంచి, ఆయన కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.