బతుకమ్మ, నిజామాబాద్ : అధికారిక విధులు నిర్వహిస్తున్న అధికారులపై దాడిచేసి,వారి విధులకు ఆటంకం కలిగించిన మహమ్మద్ మునవర్ ,మహ్మద్ అఖ్లాక్ అహ్మద్ లకు వేరువేరు కేసులలో జైలుశిక్ష విధిస్తూ నిజామాబాద్ రెండవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పాముజుల శ్రీనివాస్ రావు శుక్రవారం తీర్పు చెప్పారు. నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో గల తెలంగాణ సూపర్ మార్కెట్ పురాని హావేలి దగ్గర పోలీస్ కానిస్టేబుల్ సయ్యద్ హమీద్ ఉన్నత అధికారుల ఉత్తర్వుల మేరకు ఆ ప్రాంతంలోని పరిస్థితులపై ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఇది గమనించిన ఆటో నగర్ వాస్తవ్యుడైన మహ్మద్ మునవర్ 14 నవంబర్,2018 న ఉదయం సదరు కానిస్టేబుల్ ను విధులకు ఆటంకం కలిగించి బూతులు తిట్టి బెదిరించాడు. దీంతో మునావర్ పై కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు నేర న్యాయ విచారణ లో రుజువు అయినట్లు నిర్థారిస్తూ మునవర్ కు ఒక సంవత్సరం సాధారణ జైలుశిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా రెండు వారాలు జైలుశిక్ష అనుభవించాలని జడ్జి శ్రీనివాస్ రావు తీర్పు లో పేర్కొన్నారు.
రెవెన్యూ అధికారులకు విధులకు ఆటంకం కల్గించిన వ్యక్తికి..
అర్సపల్లి శివారులో ప్రభుత్వ భూమిని ఆక్రమించి గుడిసెలు వేస్తున్నరనే సమాచారం మేరకు 24 దిశంబర్,2018 న నిజామాబాద్ మండల కార్యాలయ రెవిన్యూ సిబ్బంది వెళ్లగా అక్కడ ఉన్న మహ్మద్ అఖ్లాక్ అహ్మద్ అనే వ్యక్తి రెవిన్యూ సిబ్బందిని అధికారిక విధులు నిర్వహించకుండా ,విధులకు ఆటంక పరిచాడు. గ్రామ రెవిన్యూ అధికారి అయిన గాజుల చిన్న నారాయణ ను దూషిస్తు కట్టెతో కొట్టి విధులు నిర్వహించకుండా ఆటంకపరిచాడనే అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో ధర్మపురి హిల్స్ నివాసుడైన మహమ్మద్ అఖ్లాక్ అహ్మద్ కు సంవత్సరంన్నర సాధారణ జైలుశిక్ష తోపాటు రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శ్రీనివాస్ రావు పదిహేను పేజీల తీర్పు వెలువరించారు.
Prev Post
Next Post