ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జిల సిఫారసులకు మొండిచేయి
పదవుల పంపకాల్లో మారుతున్న రాజకీయ ముఖచిత్రం
అనూహ్యంగా నుడా చైర్మన్ పదవి కేశ వేణుకు
నిజామాబాద్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులకు కొత్త ముఖాలు
బతుకమ్మ, నిజామాబాద్
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఊసే లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో వినాయక చవితి నాడు రాష్ట్ర పీసీసీ చీఫ్ గా నిజామాబాద్ కు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకంతో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. మొన్నటి వరకు స్థానిక ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇంచార్జిలు సిఫారసు చేసిన వారికే పదవులు అని ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే సిఫారసులు కూడా చేసేశారు. ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర రావడమే తరువాయి అని ప్రచారం జరిగింది. అయితే జిల్లాలో ఇప్పుడు కొత్త రాజకీయ ముఖచిత్రం మొదలయిందని చెప్పాలి. నిజామాబాద్ జిల్లాకు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పెద్ద దిక్కుగా ఉండగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ ఇవ్వడంతో రాజకీయంగా పదవుల కేటాయింపులో అనూహ్య మార్పులు,చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు కార్పొరేషన్ లేదా పార్టీ పదవుల రేసులో ఉన్న వారు ఏకంగా లైం లైట్ లో జిల్లాలో పదవులకు ఒకే చెప్పడం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు వస్తుండడంతో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు షాక్ లకు గురవుతున్నారు. మొన్నటి వరకు రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందార్ల కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్న కేశ వేణు అనూహ్యంగా నిజామాబాద్ నుడా చైర్మన్ పదవి రేసులోకి రావడం అందరినీ ఖంగుతినిపించింది. కేశ వేణు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రాష్ట్ర కురుమ సంఘం తరపున సీఎం సహాయనిధికి పది లక్షలు అందజేసిన కొన్ని గంటల్లోనే ఆయనకు నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఉత్తర్వులు రాకముందే జోరుగా ప్రచారం జరిగింది. మొన్నటి వరకు నుడా చైర్మన్ రేసులో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అనుచరుడు అంతిరెడ్డి రాజిరెడ్డితో పాటు మాజీ పీసీసీ చీఫ్ దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడు సంజయ్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ కేశవేణుకు ఆ పదవిని కట్టబెడుతున్నట్లు సోమవారం ఉదయం నుంచి ప్రచారం జరుగడం కాంగ్రెస్ శ్రేణులను ఖంగుతినిపించింది. అది చాలదన్నట్లు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రేసులోకి కాంగ్రెస్ నేత బాడ్సి శేఖర్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. అప్పటి వరకు నిజామాబాద్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముప్ప గంగారెడ్డికి ఆ పదవి ఖరారు అయిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కూడా ముప్ప గంగారెడ్డి పేరు సిఫారసు చేయడంతో ఆయనకు పదవి రావడం ఖాయమని ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే సమీకరణల నేపథ్యంలో మొన్నటి వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉన్న శేఖర్ గౌడ్ ను మార్కెట్ కమిటీ పదవి కోసం ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరుగడంతో కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమేనని చర్చించుకుంటున్నారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని సీనియర్ కాంగ్రెస్ నాయకుడి పేరును నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి సిఫారసు చేశారు. వినయ్ రెడ్డి చేసిన సిఫారసు ను కూడా ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓకే చెప్పారు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఆర్మూర్ మండలంకు చెందిన కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆయన పేరుతోనే జీవో కూడా విడుదల కావడం ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జికి షాక్ ఇచ్చినట్లయింది. కానీ ఇప్పటి వరకు సంబంధిత ఉత్తర్వులను బహిర్గతం చేయలేదు. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ లేదా సుదర్శన్ రెడ్డి సిఫారసు చేసిన వారికి లేదా వారి అండదండలు ఉన్న వారికి మాత్రమే పదవులు దక్కుతాయని కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది.
Next Post