. పొరుగు రాష్ర్టాల నుంచీ పేషెంట్లు వస్తున్నారు
. సీజనల్ వ్యాధుల బారిన పడిన వారు భయపడొద్దు
. జీజీహెచ్ కు వస్తే ఉచితంగానే వైద్యం అందుతుంది
. ‘బతుకమ్మ’ ఇంటర్వ్యూలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజల్లో ఎంతో నమ్మకం ఉంది. మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో జిల్లాకు చెందిన వారితోపాటు పొరుగునే ఉన్న మహారాష్ర్ట, కర్నాటక రాష్ర్టాల నుంచి రోగులు వస్తున్నారు. డెంగీ, మలేరియా సీజనల్ వ్యాధులతో బాధపడేవారు భయపడొద్దు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే ఉచితంగానే మెరుగైన వైద్యం అందుతుందని అంటున్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్. బతుకమ్మకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు…
బతుకమ్మ: రోజు వారీ ఎంత ఓపీ ఉంటోంది..?
సూపరింటెండెంట్ : జీజీహెచ్ పై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. వైద్య సేవలు పొందేందుకు ప్రతిరోజూ 2200 మంది 2600 మంది వస్తున్నారు.
ఇన్ పేషెంట్ల సంఖ్య ఎంత ఉంటోంది?
జిల్లాకు చెందిన వారితోపాటు పొరుగునే ఉన్న మహారాష్ర్ట, కర్నాటక రాష్ర్టాలకు చెందిన వారు కూడా వైద్య సేవలు పొందేందుకు వస్తున్నారు. ఇన్ పేషెంట్ల సంఖ్య సుమారు 800 నుంచి 900 వరకు ఉంటోంది.
మందుల కొరత ఉందనే ఆరోపణలున్నాయి కదా..?
కొన్ని రకాల మందుల కొరత ఉన్న మాట వాస్తమే అయినప్పటికీ అది మా తప్పు కాదు. పేషెంట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. టీజీఎస్ ఎంఎల్ నుంచి మందుల కొరత ఉంటోంది.
జీజీహెచ్ లో ప్రస్తుతం డెంగీ, వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారు ఎంత మంది చికిత్స పొందుతున్నారు?
డెంగీ పేషెంట్లు 13 మంది, వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారు ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
ఈ సీజన్ లో డెంగీ, మలేరియా తదితర రోగాలబారిన పడిన ఎంత మందికి వైద్యం చేశారు?
డెంగీ పేషెంట్లు 308 మంది, వైరల్, టైఫాయిడ్ పేషెంట్లు 245 మందికి చికిత్స అందించాం.
ఇటీవల చేపట్టిన బదిలీల ప్రక్రియ తరువాత ఖాళీల భర్తీ అయ్యిందా?
మెడికల్ కళాశాలలో ఖాళీ అయిన పోస్టులు ప్రిన్సిపాల్ పరిధిలోకి వస్తాయి. జీజీహెచ్ లో కొంత మందిని కాంట్రాక్ట్ బేసిక్ లో రిక్రూట్ చేశాం.
బదిలీల అనంతరం పూర్తి స్థాయిలో వైద్యులు వచ్చారా?
జిల్లా ఆస్పత్రికి పూర్తిస్థాయి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్లు కావాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించాం.