బతుకమ్మ, నిజామాబాద్ సిటి : మెదడులో నీరు చేరడంతో తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వృద్ధ రోగి మక్బూల్ కు శస్త్రచికిత్స చేసి విజయవంతంగా పూర్తి చేశారు. నగరంలోని సిటీ మల్టిస్పెషాలిటి ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ మరియం అఫిఫా, ఆమె బృందం పది గంటల్లో 75 ఏళ్ల వ్యక్తి మెదడు కణితికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. వృద్ధ రోగి మక్బూల్ తలనొప్పి, వాంతులు, చూపు బలహీనత, గుండె కొట్టుకోవడం వంటి అనేక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధ రోగి, అతని కుటుంబ సభ్యులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స నిర్వహించారు. అయినా అతని ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో రోగిని నిజామాబాద్లోని బోధన్ రోడ్లో గల సిటీ స్పెషాలిటీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ ప్రముఖ న్యూరో సర్జన్ డా.మరియం అఫీఫా 75 ఏళ్ల రోగి మక్బూల్ కు వైద్య పరీక్షలో స్కానింగ్ ద్వారా సుప్రాటెన్టోరియల్ హైడ్రోసెఫాలస్తో సంబంధం ఉన్న పృష్ఠ ఫోసా జెయింట్ మెలనోమా నిర్ధారణ చేశారు. మెదడులో చాలా పెద్ద కణితి గుర్తించడం, దీనిలోని చిన్న మెదడులో నీరు చేరడం వల్ల రోగి అన్ని రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని గుర్తించారు. ప్రత్యేక పరికరాలు ఆర్డర్ చేసి, పది గంటల్లో ట్యూమర్లో పేరుకుపోయిన నీటిని తొలగించి ట్యూమర్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం వైద్యులు మరియం అఫిసా విలేకరులతో మాట్లాడుతూ వృద్ధ రోగి మక్బూల్ కోసం మెదడు కణితులు తీయడానికి కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించి రోగికి శస్త్ర చికిత్స చేశామన్నారు. ఇంత సంక్లిష్టమైన ఆపరేషన్కు వారి పూర్తి మద్దతు వల్లనే ఇది సాధ్యమైందని అన్నారు. నిజామాబాద్ సిటీ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం వృద్ధ రోగి మక్బూల్ కణితి శస్త్రచికిత్సను విజయవంతం చేసినందుకు డాక్టర్ మర్యం అఫీఫా, ఆమె బృందాన్ని అభినందించారు.
