- భౌగోళిక గుర్తింపు తో ఆర్మూర్ కు పేరు ప్రఖ్యాతలు
- పసుపునకు మరింత డిమాండ్
బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ పసుపు మరో మైలురాయిని అందుకోనుంది. ఇప్పటికే పసుపు బోర్డు ఏర్పాటుతో సంచలనం సృష్టించిన పసుపు.. తాజాగా భౌగోళిక గుర్తింపుకి దగ్గరలో ఉంది. పలు ప్రత్యేక వస్తువులు,ఉత్పత్తుల కోవలోకి ఆర్మూర్ ప్రాంత పసుపు పంట చేరనుంది. భౌగోళిక గుర్తింపు బరిలో ఉన్న పసుపు పంట ద్వార నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంత పసుపుకి భౌగోళిక గుర్తింపు లభిస్తే మరో అరుదైన రికార్డ్ దక్కినట్లే. పసుపు బోర్డు ఏర్పాటుతో కోలుకున్న పసుపు రైతులు ఇప్పుడూ ఈ భౌగోళిక గుర్తింపు వల్ల మరింత మంచి జరుగుతుందని భావిస్తున్నారు. వేలాది కుటూంబాలకు మేలు జరిగే అవకాశం ఉండటంతో ఆర్మూర్ ప్రాంత పసుపుకి జియోగ్రాఫికల్ గుర్తింపు బరిలో నిలిచింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో పసుపు ప్రధాన పంట. ప్రతి సంవత్సరం వేలాది ఎకరాల్లో పసుపుని సాగు చేస్టారు ఈ ప్రాంత రైతులు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో పసుపు రైతులకు ఒక సెంటిమెంట్. పంట సాగు మొదలు నుండి మార్కెట్లో అమ్మేంత వరకు చాలా భక్తిశ్రద్దలతో పసుపు సాగు చేస్తారు రైతులు. పసుపు పంటను పవిత్రంగా సాగు చేస్తారు ఈ ప్రాంత రైతులు. పసుపు చేన్లకు వెళ్ళే ముందు, వెళ్ళీ వచ్చాక స్నానం చేసి సాగును కొనసాగిస్తారు. ఇంతటీ ప్రశస్తి కల్గిన ఆర్మూర్ ప్రాంత పసుపుకు భౌగోళిక గుర్తింపు ఇచ్చేందుకు సన్నద్దం అయ్యారు కొండా లక్ష్మన్ భాపూజీ ఉద్యాణవన విశ్వ విద్యాలయం వారు. ఆర్మూర్ ప్రాంత పసుపుకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వాలని ప్రతి పాదన పంపారు ఉద్యాణవన విశ్వవిద్యాలయం వారు. ఆర్మూర్ పసుపుకి భౌగోళిక గుర్తింపు లభిస్తే ప్రపంచ వ్యాప్తంగా పసుపు పంటకి గుర్తింపు ఉంటుంది. దీంతో ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కేంద్రం పసుపుకి ప్రత్యేకంగా బోర్డును ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసింది. తాజాగా జిఐ ఇండీకేషన్ వస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది.
పసుపు పంటను నిజామాబాద్,నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పసుపే ప్రధాన పంట. అంతరపంటగా కూడా పసుపుని సాగు చేస్తారు రైతులు. ఈ సంవత్సరం 31 వేల ఎకరాల్లొ పంట సాగు చేసారు రైతులు. పసుపు సాగులో ఎన్ని ఇబ్బందులున్నా..తమ పెద్దల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని ఈ ప్రాంత రైతులు కొనసాగిస్తున్నారు. పసుపులో రకరకాల వంగడాలు సాగు చేస్తారు రైతులు. అయితే ఎర్ర గుంటూరు రకం చాలా ఫేమస్. ఈ వంగడం దిగుబడి ఎక్కువగా వస్తుంది. అయితే గతంలో ధరలు లేక సాగు విస్తీర్ణం తగ్గింది. అయితే గత మూడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ పసుపు పంట మీద దృష్టి కేంద్రీకరించింది. దీంతో పసుపు సాగులోనూ యాంత్రీకరణ పెరిగింది. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోది నిజామాబాద్ వచ్చి పసుపు రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు . ఈ క్రమంలో పసుపు బోర్డును ఏర్పాటు చేసారు. దీంతో రైతులకు సదుపాయాలు పెరిగాయి. బాయిలర్లు, పాలిషర్లు, టార్పాలిన్లు రైతులకు కావాల్సినన్ని అందుబాటూలోకి వచ్చాయి. గత సంవత్సరం ధర కూడా రూ.20 వేలకు చేరింది. తాజాగా ఈ ప్రాంత పసుపుకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వాలని ప్రతిపాదన వెళ్లింది. ఇక వేళ కేంద్రం, సంబందిత సంస్థలు అమోదిస్తే ఇక పసుపుకి మరింత లాభం చేకూరుతుంది. ఒక్కో ప్రాంతంలో ఉండే ఒక్కో వస్తువుకి లేదా ఉత్పత్తులకు ప్రత్యేకంగా జియోగ్రాఫికల్ ఇండీకేషన్ ఇచ్చారు. తిరుపతి లడ్డూ, చండూరు కంది పప్పు, గద్వాల్, పోచంపల్లి ఇక్కత్ చీరలు, కొండపల్లి బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ పిలిగ్రీ, నిర్మల్ కొయ్యబొమ్మలు, హైదరాబాద్ హలీం లాంటి వాటికి ప్రత్యేక భౌగోళిక గుర్తింపు లభించింది. తాజాగా కొండా లక్ష్మన్ బాపూజీ ఉద్యాణవన విశ్వవిద్యాలయం వారు ఆర్మూర్ పసుపు, వరంగల్ చపాట మిరపకాయలకు జీఐ గుర్తింపు ఇవ్వాలని ప్రతి పాదించారు. ప్రతిపాదనలు పరిశీనలో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పసుపుకి భౌగోళిక గుర్తింపు లభించాలని కోరుతున్నారు ఈ ప్రాంత రైతులు. పసుపు బోర్డు ఏర్పాటుతో కొంత వరకు మెరుగయ్యామని, ఇప్పుడు జీఐ గుర్తింపు లభిస్తే పసుపు రైతులకు మంచి రోజులొస్తాయని అంటున్నారు రైతులు. ఇక ఉద్యానవణ శాఖాదికారులు మాత్రం పసుపుకి ఈ ప్రత్యేక గుర్తింపు లభిస్తే ఈ ప్రాంతంలో పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతుందని, నేరుగా రైతుల వద్దకే వ్యాపారులు వస్తారని తద్వారా పసుపుకి మంచి ధరలు వస్తాయని అంటున్నారు.