జీరోవడ్డీ దందా పై చర్యలేవి..?

1,296

. ఉమ్మడి జిల్లాలో కౌన్సిలింగ్ తోనే సరి

. మనీ లెండింగ్ కేసులు నిల్

. ఎంత మంది ప్రాణాలను పణంగా పెడితే చర్యలు?

. కేసుల నమోదు పేరుతో కాసులు వసూలు చేసిన ఖాకీలు

బతుకమ్మ, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో జీరో వడ్డీ దందా ప్రాణాలను పణంగా కోరుతోంది. వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకున్న వారు ఆస్తులతోపాటు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా జరుగుతున్న వడ్డీ దందాలో ఆస్తులను తనఖా పెట్టుకోవడమే కాకుండా నేరుగా సేల్ డీడ్ రిజిస్ర్టేషన్లు చేసుకుంటున్నారు. అవసరం కోసం అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని తమ ఆస్తులను కాపాడుకోలేని బాధితులు ఎందరో ఉన్నారు. ఆస్తులు పోయి రోడ్ల మీదికి వచ్చినవారూ ఉన్నారు. వడ్డీ దందా పోలీసుశాఖకు తెలిసే జరుగుతోంది. పోలీసుశాఖలో పని చేసే కొందరు  మనీ లెండింగ్ కేసులు నమోదు చేస్తామని వడ్డీ వ్యాపారుల వద్ధ లక్షలు వసూలు చేసిన ఘనతను సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పని చేసిన అధికారి తన హయాంలో అక్రమ వడ్డీ వ్యాపారంపై ఉక్కుపాదం అంటూ టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించి అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో ఉమ్మడి జిల్లాలో జీరో వడ్డి దందా చేసే వారి వివరాలను పోలీస్ స్టేషన్ ల వారీగా సేకరించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వానికి నివేదిక పంపించామని  ఆ అంశాన్ని పక్కన పెట్టేశారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగా ప్రాణాలు తీసుకోవడంతోపాటు ఎదుటి వ్యక్తుల ప్రాణాలను తీస్తున్నారు. 2022లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పుప్పాల సురేశ్ తన పెద్ద కొడుకుతో కలిసి విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, అతడి భార్య,  చిన్నకొడుకు లాడ్జీలో పురుగుల మందు తాగి బలవణ్మరణానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగా చనిపోతున్నామని వారు సుసైడ్ నోట్ లో పేర్కొనడంతో విజయవాడ పోలీసులు వడ్డీ వ్యాపారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.  ఆ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని వడ్డీ వ్యాపారుల వద్ద కోట్ల రూపాయల విలువ చేసే సేల్ డీడ్ లు ఉన్నాయి. ఇటీవల కామారెడ్డిలో వడ్డీ వ్యాపారి విశ్వనాథం హత్యతో మళ్లీ వడ్డి దందా చర్చనీయాంశమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు నవీపేట్, ఆర్మూర్, కామారెడ్డి, పిట్లం, బాన్సువాడ,ఎల్లారెడ్డి ప్రాంతాల్లో వడ్డీ దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. కేవలం వడ్డీ దందాపైనే ఆధారపడి జీవిస్తున్న వారెందరో ఉన్నారు.

ఉమ్మడి జల్లాలోని వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో ఇండ్లు, షాపింగ్ మాల్స్, వెంచర్లు, విద్యాసంస్థలు ఒక్కటేమిటి వాహనాలు, బంగారానికి కొదవ లేదు. వడ్డీలకు డబ్బులు తీసుకున్న వారి ఆస్తులను  అసలు చెల్లించలేదని, వడ్డీలు చెల్లించడం లేదని కబ్జా పెట్టడం ఇప్పుడు ఎక్కడో ఓ చోట నిత్యం జరుగుతోంది. అవసరానికి అప్పులు తీసుకుని వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగా ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న సమయంలోనే పోలీసుశాఖ మొసలికన్నీరు కారుస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైపెచ్చు బాధితులు ఫిర్యాదు చేస్తే సివిల్ మ్యాటర్ కోర్టులో చూసుకోవాలని ఉచిత సలహాలు ఇవ్వడం పరిపాటిగా మారింది.  సిఫారసులు లేదా కాసులు ముట్టచెబితేనే వడ్డీ వేధింపుల కేసులను పోలీసులు పట్టించుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లాలో గత కొన్ని నెలల క్రితం పోలీసు శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. పైగా వడ్డీ వ్యాపారుల ఆగడాలకు అంతేలేకుండాపోయింది.

Leave A Reply

Your email address will not be published.