రెండు లక్షల రైతు రుణమాఫీ బూటకం

1,182
  • రుణమాఫీ పేరుతో రైతులకు కుచ్చుటోపి
  • జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే

బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ పై ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ మాజీ శాసనసభ సభ్యులు హన్మంత్ షిండే మాట్లాడుతూకాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామి బూటకమని.. రుణమాఫీ మొత్తం దగా, మోసమని హన్మంత్ షిండే ఆరోపించారు. బిచ్కుంద లో నిర్వహించిన ధర్నా సమావేశంలో హన్మంత్ షిండే మాట్లాడుతూ.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చెబుతున్నవి అర్థసత్యాలు, అసత్యాలన్నారు. రుణ మాఫీపేరుతో ప్రభుత్వం రైతులకు కుచ్చు టోపీ పెట్టిందని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ తీరును నిలదీస్తూ.. జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని మండల కేంద్రాల్లో గురువారం రైతుల ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారు.ఈ ఆందోళనలు మొదటి అడుగు మాత్రమేనని తెలిపారు. రైతులపై కేసులు ఉపసంహరించు కోవాలని, రుణమాఫీ చేయనందుకు రైతులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని హన్మంత్ షిండే డిమాండ్‌ చేశారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎప్పటిలోగా రుణమాఫీ పూర్తి చేస్తారో చెప్పాలని హన్మంతు షిండే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రూ.2 లక్షలు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల చెప్పారని, రుణమాఫీపై ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారని.. రుణమాఫీపై రైతులకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ జరగక రైతులు రోడ్డెక్కుతున్నరని, ఏ పత్రిక, ఛానల్‌ చూసినా ఇవే వార్తలు కనిపిస్తున్నాయని, ఆందోళన చేస్తున్న రైతులపై ఏడేళ్లు, రెండేళ్లు శిక్షలు పడే కేసులు పెడుతూ మరోవైపు అందరికి రుణమాఫీ అయిందని సీఎం సంబురాలు చేసుకుంటున్నారని హన్మంతు షిండే విమర్శించారు.
రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని సీఎం చెబుతున్నారని, రుణమాఫీపై మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. సాంకేతిక కారణాలతో మాఫీ కాలేదని మంత్రులు చెబుతున్నారని, భట్టి చెప్పిన లెక్కలు వింటే రుణమాఫీ వట్టిదేనని తేలిపోయిందన్నారు. మాఫీ ఎట్లా ఎగ్గొడదామని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎత్తుగడలు వేస్తుందని.. అసలు రుణమాఫీపై ప్రభుత్వానికి స్పష్టత ఉందా..లేదా.. అని హన్మంతు షిండే ప్రశ్నించారు. మాఫీ 30 శాతం, కాంగ్రెస్‌ మోసం 100 శాతమన్న ఆయన ఇది రైతు స్వరాజ్యం కాదని, రైతలను ఏడిపిస్తున్న రాజ్యమని ధ్వజమెత్తారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా బీఆర్‌ఎస్‌ ఉన్నంతకాలం రైతులకు అండగా ఉంటుందని, రైతులు స్థైర్యం కోల్పోవద్దని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పచ్చి మోసగాళ్ల ప్రభుత్వం ఇదని.. 49 వేల కోట్ల వ్యవసాయ రుణాలున్నాయని చెప్పింది వారు కాదా..అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఆయన బహిరంగంగా ప్రశ్నించారు. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో కేవలం రూ.7500 కోట్లతో సరిపెట్టాలని చూస్తున్నట్టుందన్నారు. లక్షల మంది రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలని ప్రశ్నించారు. సీఎం తడిగుడ్డతో రైతుల గొంతు కోసిండని, ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్‌ బజారు భాష మాట్లాడుతున్నారని, ఆయన దుయ్యబట్టారు . రైతులకు మొత్తం రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని ఆయన హెచ్చరించారు.
జుక్కల్ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గురించి మాట్లాడుతూ ఈ ప్రాంత వాసి కాకపోయినా ప్రజల ఆశీర్వదించి గెలిపిస్తే ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాడో లేక కాంగ్రెస్ కార్యకర్తల అంతు చూడ్డానికి వచ్చాడో తెలియడం లేదంటూ ఎద్దేవ చేశారు. పలు సభ మీటింగ్లలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు చేసినట్లయితే వాళ్ల కాల్ ఇరగొడతాను అంటూ అనడం అడక్కొడు,అడక్కొడు మోపు అయ్యిండ్ర అంటూ మాట్లాడుతూ సహనం కోల్పోతున్నారని అలాగే ఆ మండలంలో ఎర్రోడు, ఈ మండలంలో కర్రోడు గ్రూపులు చేస్తున్నారని గ్రూపులు చేస్తే తాటతీస్తానని బహిరంగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇజ్జత్ తీస్తున్నాడని ఆయన చురకలంటించాడు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, మాజీ ఎంపీపీ అశోక్ పటేల్, సొసైటీ చైర్మన్ నల్చార్ బాలాజీ, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్, ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ బసవరాజ్ పటేల్, పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి నాల్చర్ రాజు, గోపాన్ పల్లి మాజీ ఎంపీటీసీ రాజు, మరియు అందరు సొసైటీ డైరెక్టర్లు పార్టీ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.