- రజకులను గ్రామం నుండి బహిష్కరణ
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి గ్రామంలోని వీ డీ సీ కమిటీ తమపై దౌర్జన్యం చేస్తుందని ఆ గ్రామ రజకులు ఆరోపించారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజకుల సంఘం జిల్లా సభ్యులు చింతకుంట శంకర్, ప్రధాన కార్యదర్శి నరేష్ మాట్లాడారు. జక్రాన్ పల్లి గ్రామంలో వీడిసి కమిటీ సభ్యులు రజకులను గ్రామం నుండి బహిష్కరించారని పేర్కొన్నారు. గ్రామంలో ఎవరైనా తమతో మాట్లాడితే జరిమానా విధిస్తామనీ హుకుం జారీ చేశారని తెలిపారు. గత నెలలో గ్రామ బహిష్కరణ పై స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. కానీ పోలీసులు ఇప్పటివరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పైనే కేసులు నమోదు చేస్తారా అంటూ వీడిసి కమిటీ సభ్యులు తమపై దాడి చేశారని రజకులు ఆరోపించారు. జిల్లా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
