బతుకమ్మ, నిజామాబాద్ :
లోన్లు తీసుకుని బ్యాంకు అధికారులను తమ చుట్టూ తిప్పించుకున్న ఖాతాదారుల గురించి విన్నాం కానీ.. రుణం తీసుకోకున్నా బ్యాంకు బాధితులుగా మారిన 42 మంది గోడును పట్టించుకునే లేకుండాపోయారు. తమ పేర్లపై రుణాలు తీసుకున్న యూనియన్ బ్యాంకు మేనేజర్ పై సంబంధిత ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించినప్పటికీ తమ పేర్లను నాన్ పెర్ఫార్మింగ్ (ఎన్ పీ) జాబితా నుంచి తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని బడాబజార్ యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ అజయ్ 42మంది ఖాతాదారులకు రుణాలు ఇచ్చినట్లు పత్రాలు రూపొందించి డబ్బులను మళ్లించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో గత వారం అజయ్ ని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒక్కసారి బ్యాంకు రికార్డుల్లో ఖాతాదారుని పేరు ఎన్ పీ జాబితాలో ఉంటే వారి సిబిల్ స్కోర్ జీరోగా మారుతుంది. ఖాతాదారులు సిబిల్ స్కోర్ జీరో అయితే మాత్రం భవిష్యత్ లో వారికి ఎలాంటి రుణాలు రావు. హౌసింగ్, బిజినెస్, ఎడ్యుకేషన్ లోన్ లతోపాటు చివరకు ప్రభుత్వాలు ఇచ్చే ముద్ర ఇతర లోన్లకు కూడా అనర్హులుగా పరిగణించబడతారు. 42 మంది బాధితులకు సంబంధించిన రికార్డులను సిబిల్ అధికారులకు బ్యాంకు అధికారులు అందజేస్తేనే వారు ఎన్ పీ జాబితా నుంచి బయటపడతారు.