బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : ఆనంద్ నగర్ లో మురుగు కాల్వలో పడి చనిపోయిన అనన్య కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. స్థానికులతో, అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నాలాలో పడి బాలిక చనిపోవడం బాధకరమన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి లోతట్టు ప్రాంతాలు, డ్రైనేజీలు, రోడ్లు తదితర సమస్యలపై దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్, అధికారులకు సూచించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం పోయిందన్నారు. నగర సమస్యల పై కలెక్టర్ ప్రతేక చొరవ తీసుకొని డ్రైనేజీ, రోడ్స్, వీధిదీపాల వంటి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనన్య కుటుంబానికి పదివేల ఆర్థికసహాయం, నిత్యావసర సరుకులు అందించి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో బీజేపీ 27వ డివిజన్ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ , 9వ డివిజన్ కార్పొరేటర్ సాధు సాయివర్ధన్, నాయకులు ఇల్లేందుల ప్రభాకర్, మఠం పవన్, ఆనంద్, చిరంజీవి, అంబదాస్ రావు, హరీష్, వెంకటరమణ, కోడూరు నాగరాజు,మఠం రవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.