సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించడం అభినందనీయం

1,487

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులను స్మరిస్తూ సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్  ధన్యవాదాలు తెలిపారు. గురువారం సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు, నరరూప రాక్షసులుగా చెలరేగిన రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 4,000 మంది సిపిఐ కార్యకర్తలు ప్రాణ త్యాగం చేశారన్నారు. దొరల గడీలలో వెట్టిచాకిరి విముక్తి కోసం బాంచన్ దొర అన్న ప్రజలతో బందూకులు పట్టించిన చరిత్ర కమ్యూనిస్టులదేనని అన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వాన 1947 సెప్టెంబర్ 11న ప్రారంభమైన పోరాటం భూమికోసం, భుక్తి కోసం, మాతృభూమివిముక్తి కోసం జరిగిందని తెలిపారు. ఈ పోరాటం మూలంగానే హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనం అయిందని, ఈ పోరాటాన్ని స్మరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం పేరుతో అధికంగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ పోరాటాన్ని గుర్తించి అధికారికంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సిపిఐ జిల్లా కౌన్సిల్ పక్షాన ధన్యవాదాలు తెలియచేస్తున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాలతో పాటు విద్యాసంస్థల్లో కూడా జాతీయ జెండాలు ఎగురవేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసిన ప్రజా పాలన దినోత్సవం పేరును తెలంగాణ సాయుధ రైతంగ పోరాట అమరవీరుల దినోత్సవంగా నామకరణం చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నామన్నారు.  ఈ ప్రెస్ మీట్ లో సిపిఐ నగర కార్యదర్శి వై.ఓమయ్య, సిపిఐ జిల్లా నాయకులు మంద.స్వరూప రాణి, బి.రఘురాం, బొంబాయి.గంగారం, ఆలీ ఇమ్రాన్, పి.హనుమాన్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.