-అధికారులకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి ఆదేశం
బతుకమ్మ, మాచారెడ్డి: ఉమ్మడి మాచారెడ్డి మండల పరిధిలోని భవానిపేట బ్రిడ్జి మరమ్మతులు చేపట్టుటకు ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు వచ్చిన వరదలకు కొట్టుకుపోయిన భవానిపేట బ్రిడ్జి ని ఆయన గురువారం సందర్శించారు. బ్రిడ్జి అప్రోచ్ లు వరద తాకిడికి దెబ్బ తినడం వల్ల మూడు గ్రామాలకు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంజనీరింగ్ అధికారులు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వరద సహాయక చర్యల నిధులతో మరమ్మతులు జరిగే అవకాశం ఉందన్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన కామటి నర్సయ్య, లచ్చపేట గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు కైరం కొండ శివ రాములు కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఆయన వెంట మండల బీజేపీ కమిటీ అధ్యక్షుడు పోసు అనిల్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల వెంకట్ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు తోట బాలరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు మదనాల శ్రీనివాస్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు కట్ట భాస్కర్ రెడ్డి, నాతి ఉమపతి గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు రాగవాపురం శ్రీనివాస్, సామాగంజి నరేష్ లు యువమొర్చ అధ్యక్షులు చెరుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.