బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో పోచారం ప్రాజెక్టు ఆయకట్టు క్రింద సాగు చేస్తున్న పంటల సాగు కోసం ఆగస్టు 15వ తేదీ నుండి నాలుగు విడతలుగా నీటిని విడుదల చేస్తున్నట్లు ఎల్లారెడ్డి నీటిపారుదల శాఖ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పోచారం ప్రాజెక్టు నీటి విడుదలపై రైతులతో తైబందీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఈఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోచారం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు చేరి, ప్రస్తుతం ప్రాజెక్టులో 16 అడుగుల మేర నీటి నిల్వ ఉందని తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటితో ప్రాజెక్ట్ ఆయకట్టు ఏ జోన్ బి జోన్ల క్రింద సాగు చేస్తున్న పంటల కోసం పోచారం ప్రధాన కాలువ ద్వారా నాలుగు విడతలుగా నీటిని విడుదల చేస్తామని తెలిపారు.
మొదటి విడతలో ఆగస్టు 15 నుండి 29 తేదీ వరకు నీటిని విడుదల చేసి 30వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు నీటి విడుదల నిలుపుదల ఉంటుందని, అలాగే రెండో విడతలో సెప్టెంబర్ 9వ తేదీ నుండి సెప్టెంబర్ 23వ తేదీ వరకు నీటిని విడుదల చేసి, సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ మూడో తేదీ వరకు నీటి విడుదల నిలిపివేయడం జరుగుతుందన్నారు. మూడో విడతలో అక్టోబర్ 4వ తేదీ నుండి 18వ తేదీ వరకు నీటి విడుదల కొనసాగించి, అక్టోబర్ 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు నీటి విడుదల నిలిపివేయడం జరుగుతుందని, నాలుగవ విడతలో అక్టోబర్ 29వ తేదీ నుండి నవంబర్ 12వ తేదీ వరకు నీటిని విడుదల చేసి, నవంబర్ 13వ తేదీ నుండి 22 వ తేదీ వరకు నీటి విడుదల నిలిపివేనున్నట్లు తెలిపారు. రైతులు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసిన నీటిని పొదుపుగా వాడుకోవాలని పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దివిటి రాజ్ దాస్, నీటిపారుదల శాఖ ఇంచార్జ్ ఏఈ శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ గోద యాదగిరి, పంచాయతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.
