- తప్పనిసరి అయితే తప్ప, దయచేసి బయటికి వెళ్లకండి
- అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి
- మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లోద్దని ఆయన కోరారు.గడిచిన నాలుగేండ్లుగా బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసినందున గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే అన్నారు.నియోజకవర్గంలో భారీ వర్షాలకు మొదటగా ఇబ్బంది పడే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను అప్రమత్తం చేయాలని, పాత ఇండ్లు,భవనాలు ఉంటే ప్రజలకు అవగాహన కల్పించి ఆస్తి, ప్రాణ నష్టము లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండి వరద నీటిని గోదావరి లోకి వదిలే పరిస్థితి తలెత్తితే గోదావరి పరివాహక గ్రామాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు.గోదావరి లో చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులకు,పశువులు మేపడానికి వెళ్లే కాపరులకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి అని సూచించారు.వ్యవసాయ పనులు కోసం పొలాలకు వెళ్లే రైతులు కరెంట్ మోటర్ల వద్ద జాగ్రత్త లు తీసుకోవాలని,ప్రజలు కరెంట్ పోల్స్ కి దూరంగా ఉండలాని కోరారు.ఎలెక్ట్రిసిటీ అధికారులు కూడా పోల్స్ పడిపోయినట్టు సమాచారం అందిన వెంటనే రీస్టోర్ చేసేలా చూడాలన్నారు.ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి చెరువులు, కుంటలను ప్రతి క్షణం పర్యవేక్షించాలని,ఎక్కడన్నా చెరువులు,కుంటలు తెగే పరిస్థితి ఉంటే ముందుగా నష్టనివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. నిండిన చెరువులు,ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు,చెక్ డ్యాం లను చూడటానికి ప్రస్తుత పరిస్తితుల్లో ప్రజలేవరు వెళ్లకూడదని ఎమ్మెల్యే కోరారు. స్థానికంగా ఉండే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని,అవసరం ఉన్న చోట ఎక్కడికక్కడ స్థానిక నాయకులు ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే వేముల కోరారు.