నిజామాబాద్, బతుకమ్మ: పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నట్లుగానే విధేయతకు పట్టం కట్టింది. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కాంగ్రెస్ జెండా చేతపట్టి నడిచిన మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను చూశారు. ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మహేశ్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా ఎదిగారు. రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన మహేశ్ కుమార్ గౌడ్ ఓటమి పాలైనప్పటికీ ఎక్కడా వెరవలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనను గుర్తిస్తూ పదవులను కట్టబెట్టింది. రాష్ర్ట గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా వైఎస్ జమానాలో పని చేశారు. పార్టీ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ గా సక్కెస్ అయ్యారు. మహేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిన కాలంలో పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనకు ‘వర్క్ హాలిక్’ గా గుర్తింపు లభించింది. కాంగ్రెస్ పగ్గాలను చేపట్టిన వారిలో జిల్లా నుంచి ధర్మపురి శ్రీనివాస్ మొదటి వారుకాగా, బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ రెండో వ్యక్తి.
