బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుక్రవారం లెండి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రాజెక్టు పనులు పరిశీలించి అధికారులను అడిగి ప్రాజెక్టు ప్లానింగ్ మరియు ఇతర వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతు 35 ఏళ్ల క్రితం ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు నత్త నడకన సాగుతున్నాయని అన్నారు.గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రాజెక్టు పూర్తి అయితే నియోజకవర్గంలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్ మండలాలలో దాదాపు 22 నుండి 25 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టు నిర్మాణంపై చర్చలు జరుపుతుందని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అంతరాష్ట్ర జల సమస్యల పరిష్కారం కొరకు ఉన్నత కమిటీని ఏర్పాటు చేసి త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపడుతామన్నారు.ప్రాజెక్టుకు కావాల్సిన భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామన్నారు.2025 నాటికి జుక్కల్ నియోజకవర్గానికి లెండి ప్రాజెక్టు నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జుక్కల్, మద్నూర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
