. రంగుమారిన నీరు
. పట్టించుకోని అధికారులు
బతుకమ్మ ప్రతినిధి, నిజామాబాద్ :
పవిత్ర గోదావరి కాలుష్య కోరల్లో చిక్కుకుంది. రాష్ర్ట సరిహద్దుల్లోని మహారాష్ర్ట ప్రాంతంలో ఉన్న ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను యథేచ్ఛగా గోదావరిలోకి విడుదల చేస్తుండడంతో నీరు కలుషితమవుతోంది. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో గోదావరి ప్రవేశించే క్రమంలో ఉన్న రెండు ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను గోదావరిలో వదులుతున్నారు. బాసర అమ్మవారి దర్శనానికి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు నీరు రంగుమారి కలుషితమవుతోందని ఫిర్యాదు చేస్తున్నారు. ప్రస్తుతం గోదావరి నీరు ఆకుపచ్చ రంగులోకి మారింది. గత పది రోజులుగా ప్రాజెక్టు అధికారులు సాగు నీటి అవసరాల కోసం నీటిని కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. కలుషిత నీరు పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మిషన్ భగీరథ అవసరాలకు కూడా ఈ నీటినే వాడుతుండడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.