సీపీ వర్సెస్ ఎమ్మెల్యే

2,568
  •  రైతు రుణమాఫీ ట్రాక్టర్ల ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ
  • జిల్లాలో చర్చనీయాంశంగా మారిన వ్యవహరం

బతుకమ్మ, నిజామాబాద్
నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకే పోలీసు కమిషనర్ షాక్ ఇచ్చారు. జిల్లాలో పోలీసు యాక్టు 30 అమలు అవుతుందని, దానికి విరుద్దంగా ఎలాంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతులు లేవని ఇప్పటికే పలు దఫాలుగా ప్రకటనలు జారీ చేశారు నిజామాబాద్ పోలీసు కమిషనర్. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ పథకం ఈ నెల 15న సాకారమైంది. ఈ విషయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ రైతులతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంకల్పించారు. ఈ మేరకు తన నియోజకవర్గంలోని మోపాల్ లో ట్రాక్టర్ ర్యాలీకి పోలీసు శాఖకు అనుమతికి దరఖాస్తు చేశారు. కానీ అనుమతి రాలేదు. జిల్లాలో పోలీసు యాక్టు 30 అమలులో ఉందని కాబట్టి అనుమతి ఇవ్వడం కుదరదని పోలీసు బాసు ఖరాఖండిగా తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మండిపడినట్లు తెలిసింది. తాను అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ శాంతియుతంగా రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ అది కూడా రూరల్ నియోజకవర్గంలో నిర్వహిస్తామంటే అనుమతి ఇవ్వకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.పోలీసు బాసు మాత్రం రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్లు అందరికీ ఒకటే చట్టమని అనుమతి నిరాకరించిన వ్యవహరం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలోనూ ఈ టాపిక్ హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఇప్పటికే తన నియోజకవర్గంలో పోలీసు అధికారుల విషయంలో తన మాట చెల్లుబాటు కావడం లేదని గుర్రుగా ఉన్నఎమ్మెల్యే భూపతిరెడ్డి ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెంతకు తీసుకెళ్లేందుకు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.