- మాల్ తుమ్మెద రైతు వేదిక వద్ద మొక్కలు నాటిన కలెక్టర్
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీలు
బతుకమ్మ, నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట మండలానికి మొదటిసారి వచ్చిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం మండలంలో సుడిగాలి పర్యటన చేసి వెళ్లిపోయారు. ముందుగా మండలంలోని మాల్ తుమ్మెద రైతు వేదిక ఆవరణలో స్వచ్ఛదనం _ పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, మాజీ ఇంచార్జ్ ఎంపీపీ దివిటి రాజ్ దాస్ లు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
స్థానిక మహిళలు జిల్లా కలెక్టర్ కు రాఖీ కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మండల కేంద్రం సమీపంలోని మాల్ తుమ్మెద ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి కళాశాల విద్యార్థులతో మాట్లాడి కళాశాల ఆవరణలో ఉన్న రాశివనాన్ని పరిశీలించారు. రాశీ వనంలో ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల ఆవరణలో మొక్కను నాటి నీళ్లు పోశారు. పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులతో విద్యా బోధన తీరుపై చర్చించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి, కళాశాలకు అదనపు అధ్యాపకులను నియమిస్తానని తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ఆరోగ్య కేంద్రంలో రిజిస్టర్ లను తనిఖీ చేసి రోగులకు సరైన వైద్య సేవలు అందిస్తున్నారా లేదా అని వైద్యున్ని అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య కేంద్రంలోని అన్ని గదులను పరిశీలించి, గర్భిణీ స్త్రీల ప్రసూతి గదిని పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే సాధారణ ప్రసవం అయ్యేలా వైద్యులు, వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డిఓ సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్,జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, స్థానిక మాజీ జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, మాజీ ఇన్చార్జ్ ఎంపీపీ దివిటీ రాజ్ దాస్, ఎంపీడీవో ప్రభాకర్ చారి, తహసిల్దార్ లక్ష్మణ్, మండల వ్యవసాయ అధికారి విజయ శేఖర్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
