బతుకమ్మ, నిజామాబాద్
ఈ నెల 19న నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు బస్సు నడిపిన డ్రైవర్ ను ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. రాఖీ పండుగ నాడు నిజామాబాద్ నగరంలో 8 సెం.మీ. వర్షం కురిసింది. దానితో నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రైల్వే అండర్ బ్రిడ్జి కింద డ్రైనేజీ జాం కావడంతో మూడున్నర అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఈ విషయాన్ని గమనించకుండానే హైదరాబాద్ నుంచి 90 మంది ప్రయాణికులతో నిజామాబాద్ బస్టాండ్ కు వస్తున్న నిజామాబాద్ 1 డిపో బస్సును డ్రైవర్ సాంబయ్య అదే ఆర్ యూబీ కిందకు తీసుకువచ్చాడు. నీరు ఎక్కువ మొత్తంలో నిలువడంతో బస్సు ముందుకు కదలలేదు. ఒక వైపు వర్షం మరోవైపు బస్సు నీట మునగడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అక్కడే ఉన్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు. కొందరు ఈత కొడుతూ బయటకు వచ్చారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల 90 మంది ప్రయాణికుల జీవితాలు ఫణంగా పెట్టారని విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ సాంబయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.