- 15 రోజుల తర్వాత విధులలోకి మాక్లూర్ డిప్యూటేషన్ ఎంపీడీఓ
- సెలవు దినాల్లో ఇన్చార్జి లేకుండానే..
- చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు
మాక్లూర్ బతుకమ్మ : ఒకరోజు సెలవు పెట్టిన కింది అధికారికి కాస్త చూసుకోండని చెప్పి ఉన్నతాధికారి అనుమతితో వెళ్తుంటారు. అలాంటిది ఏకంగా 15 రోజులు సెలవుపై వెళ్ళినప్పటికీ మరొకరికి ఇన్చార్జి ఇవ్వకపోవడం పరిషత్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. మాక్లూర్ మండల పరిషత్ లో డిప్యూటేషన్ పై చేస్తున్న ఎంపీడీవో 15 రోజుల క్రితం సెలవుపై వెళ్లారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నప్పటికీ మరొకరికి ఇన్చార్జ్ ఇవ్వలేదు. ఇన్నాళ్లు పెద్దదిక్కు లేని అనాధల తయారయింది మండల పరిషత్ పరిస్థితి. ఇదంతా తెలిసిన ఉన్నతాధికారులు సైతం మిన్నకుండిపోవడం ఆశ్చర్యకర విషయంగా ఉద్యోగులు భావిస్తున్నారు.
ఇన్చార్జి లేకుండానే..
వ్యక్తిగత అవసరాల మేరకు ఉన్నతాధికారుల అనుమతితో సెలవు పెట్టినప్పుడు మరొకరికి ఇన్చార్జి ఇవ్వాల్సి ఉంటుంది. నిజామాబాద్ రూరల్ లేదా ఆర్మూర్ ఎంపీడీఓకు బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఎలాంటి అధికారికి ఇన్చార్జిగా ఇవ్వకుండానే 15 రోజులకు మళ్ళీ వచ్చి విధులలో చేరారు. ఈ విషయాలన్నీ ఉన్నతాధికారులకు తెలిసిన స్పందించకపోవడం వెనుక మర్మమేమిటో అంతుచిక్కడం లేదని పరిషత్ ఉద్యోగులు బుర్ర గోక్కుం టున్నారు.
మాక్లూర్ ఆమె సామ్రాజ్యం..
నిర్మల్ జిల్లాలో సస్పెండ్ అయిన అధికారిని పైరవీ ద్వారా నిజామాబాద్ జిల్లాలో జక్రాంపల్లి మండలానికి ఎంపీడీఓగా వచ్చారు. ఏ సందర్భంలో మాక్లూరు పై కన్ను పడిందో గానీ పట్టుబట్టి డిప్యూటేషన్ తెచ్చుకున్నారు. విధుల్లో చేరినప్పటి నుంచి మాక్లూర్ తన సామ్రాజ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాలన చరిత్రలో లేని విధంగా 15 రోజులు సెలవు పై వెళ్లిన గాని ఇంకొకరికి ఇన్చార్జి ఇవ్వకపోవడం చూస్తేనే అర్థమవుతుంది ఆ ఎంపీడీవో ఎంతగా పాతుకుపోయారో…
అధికారుల చోద్యం..
తప్పుల మీద తప్పులు దొర్లుతున్న, అధికారుల చెంతకు ఫిర్యాదులు వెళుతున్న, ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటేషన్ రద్దు చేసి యధాస్థానంలో చేరాలని అధికారులు ఇచ్చిన ఉత్తర్వులనే ఆ ఎంపీడీఓ ఖాతరు చేయకపోవడం గమనార్హం. ఇలాంటి అధికారి సెలవు పై వెళ్లగానే మరొకరికి వెంటనే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాల్సిన ఉన్నతాధికారులు, మాక్లూరు మండల వైపు చూడకుండా మౌనం పాటించడం వెనుక మతలబు తెలియరావడం లేదని పరిషత్ ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు.