ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ
బతుకమ్మ,నిజామాబాద్ సిటి – అన్నీ రంగాలలో మహిళల సమానత్వం కోసం బలమైన పోరాటాలు నిర్మించాలని పి వో డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ మహిళలకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో ద్వారకానగర్ ఇఫ్ట్ కార్యాలయంలో పీవోడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా 7వ మహాసభ నిర్వహించారు. ముందుగా పీవోడబ్ల్యూ జెండాను జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన జిల్లా మహాసభలో రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ మాట్లాడుతూ సమాజంలో మహిళల పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకువచ్చాయని, కానీ నేడు ప్రభుత్వాలు మహిళా చట్టాలను అమలు చేయటం లేదని అన్నారు. కోట్లాడి సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు వెనక్కి తీసుకోపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుండా మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు చేస్తున్నారని వాటిని అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మనువాద భావజాలం, సామ్రాజ్యవాద విషసంస్కృతిలో బాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయి అని అన్నారు. స్థిరమైన ఉపాధి అవకాశాల కోసం పోరాడాలని, 33 శాతం మహిళా రిజర్వేషన్స్ అమలు చేయాలని, మత్తు పదార్థాలు, మద్యానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో విప్లవాత్మక మార్పు కోసం మహిళలు చైతన్యవంతమై, బలమైన పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో వక్తలుగా వచ్చిన సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, పీవోడబ్ల్యూ ఉపాధ్యక్షురాలు పిట్ల సరిత లు ప్రసంగిస్తూ.. ఆటవిక యుగం నుండి సమాజ పరిణామ క్రమంలో అభివృద్ధిలో మహిళా పాత్రే కీలకం అన్నారు. నేటికీ మహిళలు ప్రాధాన్యత ఉంటే మహిళ పథకాలు, మహిళల చుట్టూ రాజకీయాలు, దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారో అర్ధం అవుతుంది అన్నారు. స్త్రీ , పురుష సమానత్వాని కై ఈ ప్రభుత్వాల మీద పోరాడాలని అన్నారు. ఈ సభకు అధ్యక్షత జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ వహించారు. ఈ సభలో పీవోడబ్ల్యూ నగర అధ్యక్ష, కార్యదర్శులు నీలం లక్ష్మి, జి.సంజన, పద్మ, చిట్టెక్క, వెల్పూర్ లక్మి, అనంతక్కా, భారతి, డిశెట్టి రాధ, పుష్పాలత, అనురాధ, శైలజ , మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు.
