- అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం (ఏ ఐ పీ కే యస్ ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి. ప్రభాకర్ డిమాండ్
బతుకమ్మ , నిజామాబాద్ ప్రతినిధి : భీంగల్ మండలం లోని మెండోరా గ్రామానికి చెందిన వడ్డెర పేదలు సాగు చేస్తున్న భూములకు అధికారులు వెంటనే కబ్జా చూపించి, అటవీ అధికారుల వేధింపులను ఆపాలని అఖిలభారత ప్రగతిశీల రైతుసంఘం (ఏ ఐ పీ కే యస్ ) రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి. ప్రభాకర్ డిమాండ్ చేశారు.
గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ హన్మంతు కు మెండోరా పేదలతో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు మెండోరకు చెందిన వడ్డెర కుల 70 కుటుంబాలు సర్వే నెంబర్ 76 లో ప్రభుత్వ భూమిని 35 ఏళ్లుగా చదును చేసి సాగు చేసుకుంటున్నారన్నారు. రెక్కల కష్టంతో రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నారని,ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను ఆధారం చేసుకుని చదును చేసి పంటలు వేసుకుంటే, అటవీశాఖ అధికారులు తమ భూమిగా అడ్డుకుని వేధిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు నిరుపేదలకు సాగు భూములు పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పినట్లుగా తక్షణమే ప్రస్తుతం భూమిలేని నిరుపేదలందరికీ సాగు కబ్జాలు చూపించి భూముల అందజేయాలని ఆయన కోరారు.
అనేక దఫాలుగా లబ్ధిదారులు ఇట్టి భూముల కోసం వినతులు చేయడంతో పాటు, ఆందోళనలకు పూనుకున్న అధికారులు, ప్రభుత్వం పట్టించుకోన్న పాపానా పోవడం లేదన్నారు.మెండోరా నిరుపేదల సమస్యను ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లేనన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పేదలకు భూమి కబ్జాలు చూపించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ (ఎం ఎల్ )మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పిట్ల రామకృష్ణ, మాస్ లైన్ భీంగల్ మండల కార్యాదర్శి కే.రాజేశ్వర్ ఏ ఐ పీ కే యస్ జిల్లా నాయకులు జి.నడ్పినర్సయ్య, మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, బి . బాబన్న, మండల నాయకులు ఈ. రమేష్,బి.కిశోర్, కే. ఆశిస్, డి.రమేష్, రాజన్న, ఏ.నర్సయ్య, వెంకటేష్, నర్సిములు, భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.