- బోధన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహతో
- బాన్సువాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి కొప్పిశెట్టి
బతుకమ్మ నిజామాబాద్ : రాష్ట్రంలో 6 రెవిన్యూ డివిజనల్ ప్రాంతాలకు ఆర్డీవోల స్థానంలో సబ్ కలెక్టర్ల నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 తెలంగాణ క్యాడర్ కేటాయించబడిన ఇద్దరు ఐఏఎస్ లను నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని రెండు రెవిన్యూ డివిజనల్ ప్రాంతాలకు సబ్ కలెక్టర్ లు గా నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. బోధన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహతోను నియమించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి కొప్పిశెట్టి నియమించారు. కిరణ్మయి కొప్పిశెట్టి నిజామాబాద్ జిల్లాలో ట్రైనీ కలెక్టర్ శిక్షణ పొందారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలలో కామారెడ్డి జిల్లా బాన్సువాడకు సబ్ కలెక్టర్గా నియమించడం తొలిసారి. అక్కడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి కొప్పిశెట్టి తొలి అధికారిని కావడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో బోధన్ కు సబ్ కలెక్టర్లను నియమించడం రెండు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. ఉమ్మడి జిల్లాలో సబ్ కలెక్టర్లుగా బాధ్యతలు తీసుకుంటున్న ఇద్దరు అధికారులకు తొలిసారి పోస్టింగ్ కావడం విశేషం. రెండు రెవిన్యూ డివిజనల్ లకు సబ్ కలెక్టర్లను నియమించడంతో కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవిన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్, బోధన్ ఆర్ డి ఓ అంబదాస్ రాజేశ్వ ర్ లకు బదిలీ ఖాయమైంది.