
. డివైడర్ ను ఢీకొన్న అంబులెన్స్
. వైద్యం అందక వెంటిలేటర్ పై ఉన్న బాలుడు మృతి
. ఎన్ హెచ్ 161పై కన్నీళ్లు తెప్పించిన ఘటన
నిజాంసాగర్, బతుకమ్మ: విధి ఆడిన వింత నాటకంతో ఆ బాలుడు ఓడాడు. కన్న బిడ్డ కళ్ల ముందు విలవిలకొట్టుకుంటుంటే ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఆ దేవుడిపై భారం వేసి దుఖ సాగరంలో మునిగిపోయారు. మహారాష్ర్టలోని దేగావ్ కు చెందిన ఐదేళ్ల బాలుడు సాత్విక్ అనారోగ్యానికి గురికావడంతో తండ్రి మానే ఉమాకాంత్ చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. చికిత్సకు అక్కడ ఎక్కువ ఖర్చు అవుతుండడంతో దెగ్లూర్ లో చికిత్స చేయించాలని నిర్ణయించుకుని గురువారం రాత్రి అంబులెన్స్ లో వెంటిలేటర్ పై తీసుకువస్తుండగా, తెల్లవారుజామున 3గంటలకు నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లి వద్ద 161 నంబర్ జాతీయ రహదారిపై అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో బాబు సాత్విక్ వెంటిలేటర్ పైనే ఉన్నాడు. అందుబాటులో ఉన్న 1033 అంబులెన్స్ ను వారిని సంప్రదించగా వచ్చిన అందులో వెంటిలేటర్ లేకపోవడంతో చాలా సమయం వరకు అక్కడే వేచి ఉన్నారు. జాతీయ రహదారి పై ఉండే అంబులెన్స్ ను రప్పించగా అందులోనూ అంబులెన్స్ లో వెంటి లెటర్ వంటి సౌకర్యం లేక పోవడం, ఈ క్రమంలో సరైన వైద్యం అందక సాత్విక్ తల్లిదండ్రుల కళ్లముందే కన్నుమూశాడు. బాలుడి తండ్రి ఉమాకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.