- హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే
- వర్చువల్ విధానంలో శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన సీ.జే
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : సామాజిక వివాదాల సత్వర పరిష్కారంలో కమ్యూనిటీ మీడియేటర్లు క్రియాశీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆకాంక్షించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తొలిసారిగా 2021 లో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి సత్ఫలితాలు సాధించడంతో, దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలలో కమ్యూనిటీ మీడియేటర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వివిధ సామాజిక వర్గాల నుండి కమ్యూనిటీ మీడియేటర్లుగా ఎంపిక చేసిన వారికి గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో శిక్షణ తరగతులు ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24 వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ శిక్షణ తరగతులను వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే లాంఛనంగా ప్రారంభించగా, హైకోర్టు న్యాయమూర్తులు సుజోయ్ పాల్, కె.సురేందర్, జె.శ్రీనివాస్ రావు భాగస్వాములయ్యారు.