వైసీపీలో మరో వికెట్ డౌన్.. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా

  • ఈ ఉదయం పార్టీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్
  • కాసేపటికే రాజీనామా చేసినట్టు ప్రకటించిన గ్రంధి శ్రీనివాస్
  • రాజీనామా లేఖను జగన్ కు పంపించిన మాజీ ఎమ్మెల్యే

అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అవంతి రాజీనామా చేసిన కాసేపటికే మరో కీలక నేత పార్టీని వీడారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. కీలక నేతలు వరుసగా పార్టీని వీడుతుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఓడించిన ఘనత గ్రంధి శ్రీనివాస్ కు ఉంది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ పై ఆయన విజయం సాధించారు. తద్వారా పార్టీలో జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. గ్రంధి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

YSRCP Ex MLA Grandhi Srinivas resigns to party
Comments (0)
Add Comment