- జలకళను సంతరించుకొని నిండుకుండలా బీబీపేట పెద్ద చెరువు
- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
బతుకమ్మ, బీబీపేట : భారీ వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్అన్నారు. బిబిపేట పెద్ద చెరువును అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడారు. బిబిపేట చెరువు నిండటం రైతులకు శుభ సూచకమన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పూర్తిగా నిండిందన్నారు. స్థానిక రైతులు తన దృష్టికి సమస్యలను తీసుకువచ్చారని సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానన్నారు. రైతు రుణమాఫీ జరగని రైతుల కోసం గ్రామ గ్రామాన సర్వే చేసి కలెక్టర్ కార్యాలయంలో సహాయక కౌంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు రుణమాఫీ చేసి ఆదుకుంటే ప్రతిపక్షాలు బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు మింగుడు పడడం లేదని అన్నారు. ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తూ తమ స్థాయిని తగ్గించుకుంటున్నారని తెలిపారు. అకాల వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కెసిఆర్ ఫామ్ హౌస్ లో, కేటీఆర్ విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని, ప్రజలు ఇక వారికి శాశ్వతంగా విశ్రాంతి ఇస్తారని తెలిపారు.