- ఆంక్షలు విధించిన పట్టించుకోని రైతులు
- జాతీయ రహదారిపై బైఠాయించిన అన్నదాత
బతుకమ్మ నిజామాబాద్ : జిల్లా రైతులు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు చేపట్టిన తొలి నిరసనకు నిజామాబాద్ వేదికైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ విషయంలో ఉన్న షరతులు తొలగించాలని డిమాండ్ చేస్తూ రైతులు శనివారం జాతీయ రహదారిని దిగ్భందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎర్రజొన్న రైతుల బకాయిల కోసం ఉద్యమించిన రైతులు మరోసారి ఆర్మూర్ వేదికగా ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేశారు. రాజకీయ పార్టీలకతీతంగా రైతులు రుణమాఫీ కోసం షరతులు లేకుండా చేయాలని కోరుతూ 24న జాతీయ రహదారి దిగ్బంధానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు ఆంక్షలు విధించిన రైతుల పట్టించుకోలేదు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తాలో జాతీయ రహదారిపై బైఠాయించారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండకు చెందిన రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టి వాహనాలను దారి మళ్లించారు. రైతుల ధర్నాకు రాజకీయ పార్టీలు పూర్తి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అక్కడికి వచ్చిన పార్టీల నాయకులను రైతులు రా వద్దని కోరారు. రైతుల ధర్నా వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు, మాజీలను ఈ రాజకీయ వేదికగా ఉపయోగించుకోవద్దని అన్నారు. అక్కడికి వచ్చిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి రైతు రుణమాఫీ కోసం వారు చేసే దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
సెప్టెంబర్ 15 డెడ్ లైన్..
షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీని సెప్టెంబర్ 15 వరకు చేయాలని రైతులు డెడ్లైన్ పెట్టారు. చలో ఆర్మూర్ కార్యక్రమంలో పాల్గొన్న మూడు వేల మంది రైతులు ముక్తకంఠంతో రుణమాఫీని షరతులు లేకుండా చేయాలని నినదించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని హిందూ దేవుళ్ళ పై చేసిన ప్రమాణాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని రైతుల డిమాండ్ చేశారు. తమ రుణమాఫీ చేయమని అడగలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సీఎంను కోరారు. ఆర్మూర్ గడ్డ ఉద్యమాలకు పుట్టినిల్లని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని రైతులు హెచ్చరించారు.