బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : ఆర్జికార్ కళాశాల వైద్య విద్యార్థిని పై అఘాయిత్యం, హత్యను నిరసిస్తూ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీని నిర్వహించారు. సోమవారం సాయంత్రం మెడికల్ కళాశాల నుంచి గాంధీ చౌక్ వరకు అక్కడి నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ జనరల్ ఆసుపత్రి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నో సేఫ్టీ నో డ్యూటీ అంటూ నినాదాలు చేశారు. వైద్యులపై జరుగుతున్న దాడులను, అఘాయిత్యాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. పశ్చిమబెంగాల్ లోని ఆర్జీకార్ మెడికల్ కళాశాలలో వైద్య విధ్యనభ్యసిస్తున్న యువతిపై జరిగిన అఘాయిత్యం, హత్య వైద్యవిద్య చరిత్రలో మాయని మచ్చల మిగిలిందని అన్నారు. వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వైద్యుల రక్షణకు కఠిన చట్టాలను తేవాలని జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు.